సాక్షి, హైదరాబాద్: నగరంలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, నాంపల్లి, కోఠి, అబిడ్స్, బషీర్బాగ్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం పూట కావడంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు. జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యవసర బృందాలు, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశారు. నగరంలోని మ్యాన్హోల్స్ తెరవకూడదని సూచించారు. మ్యాన్హోల్స్ ఏవైనా ఫిర్యాదులు ఉంటే 155313 నంబరుకు కాల్ చేయాలన్నారు. జీహెచ్ఎంసీలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వర్షాల వల్ల సమస్యలు ఎదురైతే కాల్ సెంటర్ 100, 040-21111111 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి.. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.