మౌలిక సదుపాయాల మాటేమిటి?

4 Sep, 2018 02:04 IST|Sakshi

  సిబ్బంది, సదుపాయాలు ఉంటేనే వాటి లక్ష్యం నెరవేరుతుంది

  రైతు రుణ విమోచన కమిషన్, రైతు సాధికార సమితిపై హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణకు ఏర్పాటైన రైతు రుణవిమోచన కమిషన్‌కు.. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన రైతు సాధికార సమితికి అవసరమైన సిబ్బందితోపాటు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. సిబ్బంది, మౌలిక సదుపాయాలు ఇచ్చినప్పుడే ఏ లక్ష్యంతో రైతు రుణ విమోచన కమిషన్, రైతు సాధికార సమితులను ఏర్పాటు చేశారో, ఆ లక్ష్యం నెరవేరుతుందని తెలిపింది. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో వివరించేందుకు ఆ ప్రభుత్వాలకు గడువునిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వు లు జారీ చేసింది.

రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకునేలా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కొల్లి శివరామిరెడ్డి, పాకాల శ్రీహరిరావు మరికొందరు కోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఇటీవల ధర్మాసనం విచారణ జరిపింది.  రైతు రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, తాము రైతు సాధికార సమితి ని ఏర్పాటు చేసినట్లు ఏపీ న్యాయవాది వివరించారు. వాటికి మౌలిక సదుపాయాలు, సిబ్బంది కేటాయింపుల గురించి ధర్మాసనం ఆరా తీసింది. రైతుల సమస్యల పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థల సేవలను ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడింది. 

మరిన్ని వార్తలు