మార్కెట్‌లో ఇంటర్‌ ఫస్టియర్‌ కొత్త పుస్తకాలు

14 Jun, 2018 04:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో వివిధ భాషలకు సంబంధించిన సిలబస్‌ను మార్పు చేసినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్‌ భాషలకు సంబంధించిన పుస్తకాల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ సిలబస్‌ 2018–19 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పుస్తకాలను మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. మరోవైపు గతంలో ఫెయిలైన విద్యార్థులు 2019 మార్చి వార్షిక పరీక్షల్లో, మే/జూన్‌ నెలలో జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో పాత సిలబస్‌లో పరీక్షలు రాయవచ్చని పేర్కొంది.

మూడు రోజుల్లో రిఫండ్‌ చేస్తాం: టీఎస్‌పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్‌: పేమెంట్లు ఫెయిలైన అభ్యర్థులకు తిరిగి 3 రోజుల్లోగా రిఫండ్‌ చేస్తామని టీఎస్‌పీఎస్సీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గ్రూప్‌–4, టీఎస్‌ఆర్టీసీలో వివిధ పోస్టుల భర్తీలో భాగంగా పేమెంట్లను ఎస్‌బీఐ ఈ–పే ద్వారా స్వీకరిస్తున్న తరుణంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొంది. ఈ నెల 7 నుంచి 11వరకు చేసిన పేమెంట్ల సమస్యల్ని పరిష్కరించినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

పాలీసెట్‌ చివరి దశ సీట్లు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్‌: పాలీటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్‌–2018 ప్రవేశాల కౌన్సెలింగ్‌ ముగిసింది. చివరి దశ కౌన్సెలింగ్‌లో కొత్తగా 9,100మంది విద్యార్థులకు సీట్లు లభించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రం లోని 170 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 38,359 సీట్లు అందుబాటులో ఉండగా, చివరి దశ కౌన్సెలింగ్‌ కలుపుకొని 29,663 సీట్లు భర్తీ అయ్యాయని, 8,696 సీట్లు మిగిలిపోయాయని ఆయన తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు శుక్రవారం లోగా నెట్‌ బ్యాంకింగ్‌/క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు ద్వారా ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్‌ చేయాలని, కాలేజీల్లో నేడు, రేపు చేరాలని సూచించారు.

మరిన్ని వార్తలు