సత్వర న్యాయం అందేలా చూస్తాం

2 Dec, 2019 05:17 IST|Sakshi

కేంద్ర పశుసంవర్థక శాఖ సహాయ మంత్రి సంజీవ్‌కుమార్‌

శంషాబాద్‌: దిశ కుటుంబసభ్యులకు సత్వర న్యాయమందేలా చూస్తామని కేంద్ర పశుసంవర్థక శాఖ సహాయ మంత్రి సంజీవ్‌కుమార్‌ అన్నారు. రాజకీయ నేతగా కాకుండా ఓ వెటర్నరీ వైద్యుడిగా పరామర్శించడానికి వచ్చానన్నారు. ఆదివారం జస్టిస్‌ ఫర్‌ దిశ తల్లిదండ్రులు, సోదరిని ఆయన పరామర్శించారు. అంతకుముందు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రం ఎంపీ రంజిత్‌రెడ్డితో కలసి ఆయన శంషాబాద్‌లోని డీసీపీ కార్యాలయానికి వెళ్లి సైబారాబాద్‌ సీపీ సజ్జనార్‌తో జస్టిస్‌ ఫర్‌ దిశ కేసుపై చర్చించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరించాలని మంత్రి సూచించారు. ఫాస్ట్రాక్‌ కోర్టు ద్వారా త్వరితగతిన కేసును పూర్తి చేయాల్సిన అవసరముందన్నారు.

మంత్రుల వ్యాఖ్యలు సరికాదు..
బాధ్యాయుత పదవుల్లో ఉన్న హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ అనుచితంగా మాట్లాడారని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. జస్టిస్‌ ఫర్‌ దిశ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ మంత్రి 100 నంబరుకు ఫోన్‌ చేయకపోవడం పొరపాటని అంటే.. మరొకరు ప్రతి మహిâళకు పోలీసు కాపలా ఉంటుందా.. అని వెటకారంగా మాట్లాడారని విమర్శించారు. ఆ మంత్రులపై కూడా జస్టిస్‌ ఫర్‌ దిశకు జరిగిన లాంటి సంఘటన జరిగితే గానీ వారికి ఆ బాధ తెలియదన్నారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లెవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో ఆయనకు వ్యతిరేక గొంతులను అణచివేయడానికి పోలీసులను వాడుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. జస్టిస్‌ ఫర్‌ దిశ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

బంగారు తెలంగాణ ఎలా సాధ్యం’
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఆదివారం సుందరయ్య పార్కు వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో జస్టిస్‌ ఫర్‌ దిశ హత్యను నిరసిస్తూ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. జస్టిస్‌ ఫర్‌ దిశ కేసులో నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు