‘కేసీఆర్‌ నిజాయితీతో బడ్జెట్‌ను తయారు చేశారు’

22 Feb, 2019 20:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు మభ్యపెట్టే లెక్కల పద్దులు కాకుండా నిజాయితీతో బడ్జెట్‌ను తయారు చేశారని టీఆర్‌ఎస్‌ నేత కర్రె ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. పేదలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ బడ్జెట్‌ను రూపొందించారని తెలిపారు. కేంద్రం నుంచి రావలసిన నిధులను దృష్టిలో పెట్టుకుని ఓటన్ అకౌంట్ బడ్జెట్ రూపకల్పన చేశారని వెల్లడించారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. 

మ్యానిఫెస్టోను ఓ బైబిల్, భగవద్గీత, ఖురాన్‌లాగా భావించి, చెప్పింది చేస్తున్నారన్నారు. లక్షా 82 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో 1800 కోట్లను కేటాయించి ఇచ్చిన మాట నిలుపుకున్నారని పేర్కొన్నారు. రైతు బంధు, వైద్యం, విద్య, ఆసరా వంటి అనేక రకాల సంక్షేమ పథకాలకు సముచిత రీతిలో నిధులను కేటాయించారని తెలిపారు.

మరిన్ని వార్తలు