విజయనిర్మల భౌతికకాయానికి కేసీఆర్‌ నివాళి

27 Jun, 2019 18:11 IST|Sakshi

హైదరాబాద్‌ : అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. గురువారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశానికి హాజరైన కేసీఆర్‌ అక్కడి నుంచి నేరుగా నానక్‌రామ్‌గూడలోని కృష్ణా నివాసానికి చేరుకున్నారు. విజయ నిర్మల భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. భార్య మృతితో కన్నీరు మున్నీరు అవుతున్న కృష్ణను కేసీఆర్‌ ఓదార్చారు. కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. దాదాపు 20 నిమిషాల పాటు కేసీఆర్‌ అక్కడే ఉన్నారు.

కేసీఆర్‌ వెంట వచ్చిన మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీలు కే కేశవరావు, సంతోష్‌కుమార్‌, రంజిత్‌రెడ్డి విజయ నిర్మల పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేసీఆర్‌.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలను ఆయన కొనియాడారు. గత కొంతకాలంగా కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయ నిర్మల బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు