‘నీటి ప్రాజెక్టుల రూపకల్పన ఘనత వైఎస్సార్‌దే’

2 Sep, 2019 12:56 IST|Sakshi

సాక్షి, ఇబ్రహీంపట్నం : తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత మహానేత వైఎస్సార్‌దే అని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తన పాలనాకాలంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వైఎస్సార్‌కు తెలంగాణలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారని తెలిపారు. తన రాజకీయ గురువు, ఎల్లవేళలా వెన్నంటి ప్రోత్సహించిన వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తున్నానన్నారు. నేడు(సోమవారం) దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా కోమటిరెడ్డి మహానేతను గుర్తుచేసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉచితంగా విద్యుత్ సరఫరా, పేదల పాలిట వరంలా నిలిచిన ఆరోగ్యశ్రీ,108 వ్యవస్థను వైఎస్సార్‌ నెలకొల్పారన్నారు. ప్రతి పేదవాడు కార్పొరేట్ స్థాయిలో వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. ‘రైతు బాంధవుడు, జలయజ్ఞం ద్వారా రైతాంగానికి  సాగునీరు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఉన్న మహానేత వైఎస్సార్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేపట్టిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. ముచ్చర్లలో పార్మ సిటీ ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం చెరువుకు నీరు వచ్చేది కానీ ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం చేశారు. కాళేశ్వరానికి పెట్టిన బాహుబలి మోటార్లు తెచ్చింది కూడా వైఎస్సారే’ అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టులకు పేరు, డిజైన్ మార్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాపీ కొట్టారని కోమటిరెడ్డి విమర్శించారు.

మరిన్ని వార్తలు