ఆర్టీసీ బస్సులో పైరసీ సినిమా.. కేటీఆర్‌ ఫైర్‌

16 Apr, 2018 14:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పైరసీ సినిమాలు ప్రదర్శించడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. న్యాచురల్‌ స్టార్‌ నాని తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ విడుదలైన మరుసటి రోజే టీఎస్‌ఆర్టీసీ గరుడ బస్సులో ప్రదర్శించారు. ఈ విషయాన్ని సునీల్‌ కొప్పరపు అనే యువకుడు కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గరుడ బస్సులో కృష్ణార్జున యుద్దం పైరసీని వేశారని స్క్రీన్‌ షాట్‌తో సహా కేటీఆర్‌కు ట్వీట్‌లో తెలిపాడు. ప్రభుత్వ సంస్థల్లోనే పైరసీ జరుగుతుంటే, ఫైరసీనీ నియంత్రించాలని సామాన్యుడిని ఎలా అడుగుతారని సునీల్‌ ప్రశ్నించాడు. 

దీంతో యువకుడి ట్వీట్‌కు కేటీఆర్‌ వెంటనే స్పందించారు. ఆర్టీసీ సిబ్బంది తీరుపై మండిపడిన ఆయన‌.. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని సంస్ధ ఎండీని కోరారు. కాగా, కేటీఆర్‌ వెంటనే స్పందించడంతో సునీల్‌ ఆయనకు ధన్యవాదాలు తెలిపాడు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు కేటీఆర్‌ స్పందించే తీరుపై అతడు హర్షం వ్యక్తం చేశాడు. 

మరిన్ని వార్తలు