ప్రేమను పెద్దలు అంగీకరించలేదని...

19 Jun, 2015 00:32 IST|Sakshi

మహబూబ్‌నగర్: మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం జిల్లాలోని కోడేరు మండలం నర్సాయిపట్టి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన తెలుగు మద్దిలేటి (17) అదే గ్రామానికి చెందిన కుర్వ నాగమణి(17) అనే యువతీ, యువకులు గత రెండు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. అయినా మైనారిటి తీరగానే వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత సోమవారం మద్దిలేటి, నాగమణిలు తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకునేందుకు ఊరు వదిలివెళ్లారు.

దీంతో నాగమణి తండ్రి నారాయణ తన బిడ్డను మద్దిలేటి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని కోడేరు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈవిషయాన్ని ఫోన్ ద్వారా మద్దిలేటికి గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో మనస్తాపం చెందిన ఇరువురు ప్రేమికులు గ్రామ సమీపంలో ఉన్న చిన్న బంగారయ్య మామిడి తోట వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు