చిన్నారి సహా తల్లి సజీవ దహనం

11 Feb, 2019 04:37 IST|Sakshi

కుటుంబ కలహాలతో ఘాతుకానికి ఒడిగట్టిన భర్త

ఘట్‌కేసర్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడిపై ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సీఐ రఘవీర్‌రెడ్డి కథనం మేరకు.. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్‌ ప్రాంతంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులను కాల్చివేసినట్లు స్థానికులు, వీఆర్‌ఏ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన మాచెల్ల రమేష్, గూడూరుకు చెందిన కందిగ శుశ్రుత 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరివీ వేర్వేరు సామాజిక వర్గాలు.

ఈ దంపతులకు 4 నెలల బాబు ఉన్నాడు. భర్తతో గొడవపడిన శుశ్రుత కొద్ది రోజులుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. సమస్యను పరిష్కరించుకుందామని భార్యను ఉప్పల్‌కు రమేశ్‌ పిలిపించాడు. కుమారుడితో కలిసి శుశ్రుత ఓఆర్‌ఆర్‌ వద్దకు వచ్చింది. ఈ సందర్భంగా వారి మధ్య మళ్లీ వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెందిన శుశ్రుత.. తాను నిద్రమాత్రలను మింగడమేగాక మరో మాత్రను పాలలో కలిíపి కుమారుడికి తాగించింది. ఆపస్మారక స్థితికి చేరుకున్న వారిని రాత్రి 9 గంటల ప్రాంతంలో రమేష్‌.. ప్రభాకర్‌ ఎన్‌క్లేవ్‌ ప్రాంతానికి తరలించి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం నేరుగా పాలకుర్తికి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ సందర్భంగా.. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడైందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

మరిన్ని వార్తలు