రూ.ఐదు వేలు ఇస్తా.. అబార్షన్‌ చేయించుకో

13 May, 2019 07:50 IST|Sakshi

   ఐదు నెలలుగా లైంగికదాడి

గర్భందాల్చడంతో విషయం వెలుగులోకి

సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి..

సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన ఇది.. అభం శుభం తెలియని ఓ బాలికపై మానవమృగం ఐదు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఉదంతమిది. చివరకు ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగుచూసింది. బాధితులు పెద్దమనుషులను ఆశ్రయించడంతో బాలిక శీలానికి వెలకడుతూ అంతో ఇంతో ఇప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా ఆదివారం రాత్రి విశ్వసనీయ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు.. 

పెన్‌పహాడ్‌(సూర్యాపేట) : మండల పరిధిలోని నాగులపహాడ్‌ గ్రామానికి చెందిన ఓ బాలిక(14)పై అదే గ్రామానికి చెందిన పక్క ఇంటికి చెందిన తేరపంగి అలేందర్‌ కన్నేశాడు. బాలిక తల్లి ఐదు నెలల క్రితం కూలి పనుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెళ్లింది. బాలిక తన తండ్రితో కలిసి ఉంటోంది.

టీవీ చూసి వస్తుండగా..
ఐదు నెలల కిత్రం సదరు  టీవీ చూసి వస్తుండగా అలేందర్‌ ఆ బాలికను బలవంతంగా తీసుకెళ్లి నోట్లోగుట్టలు కుక్కి లైంగికదాడి చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించాడు. అప్పటినుంచి ఆ మానవ మృగం ఆ మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు.

తండ్రి చనిపోవడంతో..
గత పక్షం రోజుల క్రితం ఆ బాలిక తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో ఆమె తల్లి స్వగ్రామానికి వచ్చింది. అప్పటినుంచి ఇక్కడే ఉంటోంది. అయితే నాలుగురోజుల క్రితం బాలిక అనారోగ్యం బారిన పడడంతో గ్రామానికి వచ్చిన వైద్య సిబ్బందికి చూపించింది. వారు గర్భవతి అని తేల్చడంతో కంగుతింది. ఈ దారుణానికి కారకులు ఎవరని నిలదీయంతో అభాగ్యురాలు జరిగిన పాశవిక దాడిని తల్లికి వివరించి బోరుమంది.

రూ.ఐదు వేలు ఇస్తా.. అబార్షన్‌ చేయించుకో..
తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరుతూ బాధితులు గ్రామంలోని పెద్ద మనుషులను ఆశ్రయించారు. వారు ఆ మృగాన్ని పిలిపించి మాట్లాడితే ‘‘ రూ. ఐదు వేలు ఇస్తా.. అబార్షన్‌ చేయించుకో’’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. అయితే నిందితుడిని పోలీసులకు పట్టించి బాలికకు న్యాయం చేయాల్సిన పెద్ద మనుషులే ఆ అభాగ్యురాలి శీలానికి వెలకడుతూ అంతో ఇంతో ఇప్పిస్తామని చర్చలు సాగిస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
బాలికపై మానవమృగం ఐదు నెలలుగా లైంగిక దాడి

మరిన్ని వార్తలు