మిషన్‌ భగీరథ క్షేత్ర పర్యటనకు కేంద్ర బృందం 

15 May, 2019 05:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ ప్రాజెక్టు క్షేత్ర స్థాయి పరిశీలనకు కేంద్ర బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. దేశంలోని తాగునీటి సరఫరా పథకాల పనితీరు, తీరుతెన్నులను పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగంలోని అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర తాగునీటి విభాగం డిప్యూటీ సలహాదారు డి.రాజశేఖర్‌ నేతృత్వంలో అధికారుల బృందం మూడు రోజుల పాటు వివిధ జిల్లాల్లో పర్యటించనుంది. బుధవారం నాగర్‌కర్నూలు జిల్లాలోని ఎల్లూరు ఇంటెక్‌ వెల్, వాటర్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌తో పాటు భగీరథ నీరు సరాఫరా అవుతున్న గ్రామాలను పరిశీలించనుంది. గురువారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ కోమటిబండ, సిద్దిపేట గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. శుక్రవారం ఎర్రమంజిల్‌లోని మిషన్‌ భగీరథ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమావేశం కానుంది. 

మరిన్ని వార్తలు