రైతు బంధును నిర్వీర్యం చేస్తున్నారు..

29 Feb, 2020 12:29 IST|Sakshi

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పంట రుణాల మాఫీపై తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆరువేల మంది రైతులు అప్పులు బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.

రైతు బీమా 59 ఏళ్ల లోపు వారికి మాత్రమే వర్తింపుచేస్తున్నారని.. ఆత్మహత్య చేసుకున్న రైతుకు 6 లక్షల రూపాయలు ఇవ్వాలనే ఉత్తర్వులు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రైతు బంధును నిర్వీరం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ఎకరాల లోపు ఉన్నవారికే రైతు బంధు ఇస్తున్నారన్నారు. వడ్డీ రాయితీ కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన రాయితీలు నిలిపివేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఆంక్షలు లేకుండా రైతు బంధు అమలు చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై చర్చించామని.. రాబోయే బడ్జెట్‌లో సమావేశాల్లో కూడా చర్చిస్తామని వెల్లడించారు. ఎకరానికి రెండు క్వింటాలు కందులు కొనుగోలు చేస్తామని చెప్పడం భావ్యం కాదన్నారు. పసుపు  క్వింటాలు కు 10వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు