రాజకీయ పార్టీల వైపు చూడకండి : రేవంత్‌ రెడ్డి

13 Oct, 2019 16:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రెండు రోజులు డిపోకు రాలేదని ఉద్యోగులను తీసేస్తే మరి ఆరేళ్లుగా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని ఏం చేయాలి? పీడీ యాక్ట్‌ పెట్టాలా అని మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి వ్యంగ్యంగా నిలదీశారు. ఆదివారం హైదరాబాద్‌లో పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రేవంత్‌ రెడ్డితో పాటు ఆర్‌. కృష్ణయ్య, పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మంలో చనిపోయిన శ్రీనివాస్‌రెడ్డి ఆర్ధికంగా బలహీనుడు కాదని, ఉద్యోగ భద్రత గురించి ఆందోళనే అతని మృతికి కారణమని చెప్పారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి ముఖం చెల్లక ముఖ్యమంత్రి ప్రెస్‌నోట్లు రిలీజ్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. సమ్మె చట్టబద్ధంగా జరుగుతుంటే ఆట మధ్యలో గేమ్‌ రూలు మారుస్తామంటే కుదరదని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. గతంలో ఆర్టీసీ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీష్‌రావు ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదని అనుమానం వ్యక్తం చేశారు.

ఇప్పుడు సమ్మెను విఫలం చేస్తే భవిష్యత్తులో టీచర్లను కూడా పాలెగాళ్లుగా చూసే పరిస్థితి వస్తుందని రేవంత్‌ రెడ్డిహెచ్చరించారు. తెలంగాణ వద్దన్నవాళ్లను మంత్రులుగా నియమించి, సమాజంలో గౌరవం ఉన్నోళ్లను కేసీఆర్‌ దూరం పెట్టారని ఆరోపించారు. చుక్కా రామయ్య, వరవరరావు, కోదండరాం వంటి వాళ్లను అణచివేతకు గురిచేస్తోందని ప్రభుత్వాన్ని విమర్శించారు. పెన్నుమీద మన్ను కప్పితే గన్నులై పేలుతయ్‌ అంటూ వాగ్బాణాలు సంధించారు. ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీల వైపు చూడొద్దని, తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడకుండా మీ బాధ్యత సక్రమంగా నెరవేర్చండని రేవంత్‌ రెడ్డి హితబోధ చేశారు. ఆరు నెలలు కొడుకు, అల్లుడికి మంత్రి పదవి లేకపోతే తట్టుకోలేకపోయారని మరి నిరుద్యోగులు ఎంతకాలం వేచి చూడాలని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ, పోలీసు సంఘాలు 19 న జరిగే బంద్‌కు సహకరించాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు