హైదరాబాద్‌ మెట్రో రైలును ప్రారంభించిన మోదీ

28 Nov, 2017 14:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. మియాపూర్‌-అమీరీ్‌పేట-నాగోల్‌ మధ్య మెట్రో సర్వీసులకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వరకూ మెట్రో రైలులో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌, పలువురు మంత్రులు ప్రయాణించారు. అలాగే అదే రైలులో మరలా మియాపూర్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.

ఈ ప్రయాణంలో ప్రధాని వెంట గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, కేటీఆర్‌,  హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ నేత కిషన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు ఉన్నారు. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు దాదాపు పది నిమిషాల పాటు ఆహ్లాదకర వాతావరణంలో సాగిన ఈ మెట్రో రైడ్లో మెట్రో ప్రాజెక్టు విశేషాలను మోదీకి మంత్రి కేటీఆర్ వివరించారు. మెట్రో రైడ్ ఆద్యంతం మోదీ, కేటీఆర్‌ మాట్లాడుకుంటూనే ఉన్నారు.

అంతకు ముందు ప్రధాని మియాపూర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెట్రో లైన్‌ పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరించారు. ఆ తర్వాత మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ను ప్రారంభించి, మెట్రో రైలు ప్రాజెక్ట్‌ వీడియో ప్రదర్శనను తిలకించారు.  అలాగే మెట్రో రైల్‌ బ్రోచర్‌తో పాటు యాప్‌ను విడుదల చేశారు. ముందుగా ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కొద్దిసేపు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో మియాపూర్‌కు బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట బీజేపీ నేతలు లక్ష్మణ్‌, కిషన్‌ రెడ్డి ఉన్నారు.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 

మరిన్ని వార్తలు