డీసీసీ సారథి మహేశ్వర్‌రెడ్డి

14 Nov, 2014 03:08 IST|Sakshi

ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవి మహేశ్వర్‌రెడ్డికి వరించింది. మొదట భార్గవ్‌దేశ్ పాండేను ప్రకటించిన తర్వాత పార్టీలో వివాదం చోటుచేసుకోవడం, ఆ తర్వాత తెరపైకి మహేశ్వర్‌రెడ్డి పేరు రావడం తెలిసిందే. ఈ ఇద్దరిలో అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనని పార్టీలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యం లో గురువారం ఏఐసీసీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఖరారు చేస్తూ నియామక పత్రాన్ని పీసీసీకి పంపారు.

 రాత్రి 8గంటల ప్రాంతంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, నాగయ్య తదితరుల సమక్షంలో మహేశ్వర్‌రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు. కాగా ప్రేమ్‌సాగర్‌రావు వర్గానికి చెందిన భార్గవ్‌తో పాటు ఆ వర్గంలోని నాయకులతో మహేశ్వర్‌రెడ్డి రాజీ కుదుర్చుకోవడంతోనే పార్టీలో వివాదం సద్దుమణిగిందనే ప్రచారం జరుగుతోంది.

 కాంగ్రెస్‌లో మారుతున్న సమీకరణాలు..
 తాజాగా మహేశ్వర్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించినప్పటికీ ప్రత్యర్థి వర్గం నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడం వెనక పలు సమీకరణాలు చోటుచేసుకున్నాయనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో గురువారం మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులైన భార్గవ్‌దేశ్‌పాండే, అనిల్‌జాదవ్, హరినాయక్, తదితరులతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో వారి నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి తన హస్తం అందిస్తానని మహేశ్వర్‌రెడ్డి వారికి భరోసానిచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై ఆసక్తి కలిగిస్తోంది. ఇదివరకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సి.రాంచంద్రారెడ్డి తనకుతానే అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతూ కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పార్టీకి విన్నవించారు. తన నియోజకవర్గంపై తాను దృష్టి సారిస్తానని పార్టీకి తెలిపారు. రాంచంద్రారెడ్డితో మహేశ్వర్‌రెడ్డి సన్నిహితంగా ఉన్నారు. ప్రస్తుతం భార్గవ్‌ను రాజీ కుదుర్చుకునేందుకు ఎలాంటి ఆపన్నహస్తం మహేశ్వర్‌రెడ్డి చూయించారనే దానిపై చర్చ సాగుతోంది.
 
 ఏలేటిని వరించిన పగ్గాలు..
 2009లో నిర్మల్ నియోజకవర్గం నుంచి పీఆర్పీ పార్టీ తరఫున బరిలోకి దిగి ప్రధాన ప్రత్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డిపై విజయం సాధించిన మహేశ్వర్‌రెడ్డి అప్పట్లో జిల్లాలో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు.

 కాంగ్రెస్‌లో మాజీ ఎంపీ వివేక్, సి.రాంచంద్రారెడ్డితో కలిసి ప్రత్యర్థి వర్గం ప్రేమ్‌సాగర్‌రావుతో రాజకీయంగా ఢీకొట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగినప్పటికీ ఓటమి చెందారు. రెండు నెలల కిందట డీసీసీ అధ్యక్షుడిగా భార్గవ్‌దేశ్ పాండేను అదిష్టానం ప్రతిపాదించినప్పుడు మహేశ్వర్‌రెడ్డి వర్గం వ్యతిరేకించింది. తాజాగా ఆయన ఆ వర్గంతో రాజీ కుదుర్చుకొని రాజకీయంగా కీలక పదవిని చేపట్టారు.
 
పూర్వ వైభవానికి కృషి..
 కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవానికి కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. ఇకపై గ్రూపుల్లేని కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందని, అందరిని కలుపుకొని వెళ్తానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గెలుపొందే దిశగా పార్టీని పటిష్టపరుస్తానన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో క్యాడర్‌ను పెంపొందిం చి పటిష్ఠం చేస్తానని, తనపై నమ్మకం ఉంచి పదవిని అప్పగించినందుకు అధినేత సోనియా గాంధీ, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, వివేక్, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు