‘న్యాక్’ వివాదం కొత్త మలుపు

27 Nov, 2014 00:47 IST|Sakshi
‘న్యాక్’ వివాదం కొత్త మలుపు
  • సీఎం చైర్మన్‌గా కొత్త పాలక మండలి ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • రెండ్రోజుల క్రితం ఇదే తరహా ఉత్తర్వులిచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కారు
  • ఇరు రాష్ట్రాల మధ్య మరింత ముదిరిన లొల్లి
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య నలుగుతున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) వివాదం కొత్త మలుపు తిరిగింది. న్యాక్‌కు ఆంధప్రదే శ్ సీఎం చైర్మన్‌గా పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిన 48 గంటల్లోనే... తెలంగాణ ప్రభుత్వం పాలక మం డలిని నియమించింది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా, రోడ్లు భవనాల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా, న్యాక్ డీజీ సభ్య కార్యదర్శిగా, మరో 23 మందిని సభ్యులుగా పేర్కొంటూ తెలంగాణ సర్కారు బుధవారం ఉత్తర్వు జారీ చేసింది.

    దీంతో న్యాక్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అంతరం మరింత పెరిగింది. ఇప్పటికే పలు సమావేశాల పేరుతో తెలంగాణ సీఎం తరచూ న్యాక్‌కు వెళ్తున్నారు. ఏపీ సీఎం అక్కడికి వెళ్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారటం ఖాయమని అధికారులు పేర్కొంటున్నా రు. సొసైటీ జాబితాలో ఉన్నందున న్యాక్ విభజన జరగలేదు. సొసైటీల చట్టాన్ని మార్చనందున న్యాక్ తమకే దక్కుతుందని ఏపీ వాదిస్తుండగా, తెలంగాణలో ఉన్నం దున మాకే చెందుతుందని ఈ ప్రభుత్వం పేర్కొంటోంది.
     
    పాలక మండలిలో సభ్యులు వీరే...

    తెలంగాణ ప్రభుత్వం న్యాక్‌కు ఏర్పాటు చేసిన పాలక మండలి సభ్యులు వీరే.. ముంబైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ డీజీ, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఢిల్లీ) అధ్యక్షుడు, ఆ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఢిల్లీ) చైర్మన్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ రీసెర్చ్ కౌన్సిల్ (ఢిల్లీ) డెరైక్టర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ క న్‌స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ డెరైక్టర్, జేఎన్‌టీయూ వీసీ, ఇండియన్ కాంక్రీట్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డీజీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఎండీ, గృహ నిర్మాణం, ఆర్‌అండ్‌బీ, పురపాలక, నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వీసీఎండీ, గృహ నిర్మాణ సంస్థ, పోలీసు గృహ నిర్మాణ సంస్థల ఎండీలు, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్, డీఆర్‌డీవో అడిషనల్ డీజీలు.
     
    చంద్రబాబు నోట నీతులు.. చేతల్లో రోతలు: మంత్రి హరీశ్‌రావు


    ఏపీ సీఎం చంద్రబాబు నోటితో నీతు లు చెబుతూ రోత పనులకు దిగజారుతున్నారని మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలసి శాసనసభాపక్ష కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ‘న్యాక్’ కేంద్ర గవర్నింగ్ బాడీకి చంద్రబాబే చైర్మన్‌గా నియమించుకోవడం దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. ఫిబ్రవరి దాకా గవర్నింగ్ బాడీకి కాలపరిమితి ఉన్నా ఇప్పటికిప్పుడే చంద్రబాబు స్వయంగా చైర్మన్‌గా నియమించుకోవడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. కేవలం తెలంగాణతో వివాదాలు, గొడవలు పెట్టుకోవడానికే ఈ గవర్నింగ్ బాడీని ఏర్పాటుచేశారని హరీశ్‌రావు విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి చంద్రబాబు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నాడన్నారు. ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరును సమర్థించిన టీటీడీపీ నేతలు హైదరాబాద్ న్యాక్‌కు చంద్రబాబు ఉండాలని సమర్థిస్తరా.. వ్యతిరేకిస్తరా? అని హరీష్‌రావు ప్రశ్నించారు.
     

మరిన్ని వార్తలు