హిందువులకు రక్షణ లేకుండా పోయింది

8 Jul, 2018 12:58 IST|Sakshi
పరిపూర్ణానంద స్వామి(పాత చిత్రం)

పరిపూర్ణానంద స్వామి

హైదరాబాద్‌ : హిందువుల పట్ల జరిగిన సంఘటనకు దేశ విదేశాల్లో ఉన్న హిందువులు అందరూ ఆవేదనకు గురయ్యారని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆదివారం పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. హిందూ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రాముడు ఒక దగుల్భాజీ అని, సీత రాముని కన్నా రావణాసురుడి దగ్గర ఉంటేనే ఎక్కువ సుఖపడేదని కత్తి మహేశ్‌ ఆరోపణలు చేయడం చూస్తుంటే..ఆయన సంచలనం కోసమే ఇలా మాట్లాడుతున్నాడని తెలుస్తోందని అన్నారు. కత్తి వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు.

సీతమ్మను దూషించడం అంటే యావత్‌ స్త్రీ జాతిని అనడమేనన్నారు. రాజ్యాంగంలో శ్రీరాముని చిత్రపటాన్ని పెట్టడానికి కారణం..రాముడు చర్రిత కారుడు అని చెప్పడానికేనని తెలిపారు. ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించడం కాదా అని ప్రశ్నించారు. పైశాచిక ఆనందం కోసమే ఇలా మాట్లాడుతున్నారని కత్తి మహేశ్‌ను ఉద్దేశించి అన్నారు. ఇది దేశద్రోహం..బడుగు బలహీన వర్గాల ముసుగులో మహేశ్‌ ఈవిధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రామనామ స్మరణ చేస్తూ అన్ని వర్గాల వారు రేపు(సోమవారం) తనతో పాదయాత్ర చేస్తారని తెలిపారు. కత్తి మహేశ్‌ మాటల వెనక కుట్ర ఉందని, కులాల అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. .

‘ నీకు ఎలా సమాధానం చెప్పాలో మా వాళ్ల దగ్గర ఉపాయాలు ఉన్నాయ్. పోలీసులు, ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అదుపు తప్పి బరితెగించి వ్యాఖ్యలు చేస్తున్నారు. కత్తి మహేష్ వ్యాఖ్యలకు రెండు రాష్ట్రాల సీఎంలు సమాధానం చెప్పాలి. ప్రతి శ్రీరామ నవమికి ఇద్దరు సీఎంలు దగుల్బాజీల దగ్గరకు పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్నారో చెప్పాలి. ఎవరు ఏ మతం మీద దాడి చేసినా ప్రభుత్వం సెక్యులర్‌గా పని చేయాలి. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి. నీవు హిందువు కాదు, శ్రీరాముడిని దూషించిన వారు ఎవరూ హిందువులు కాదు. రేపు(సోమవారం) బషీర్ బాగ్ నుంచి యాదగిరిగుట్ట వరకు ధర్మాగ్రహా యాత్ర చేస్తాం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రీరాముడికి పాలాభిషేకం చేస్తాం. సాధువులకు నిగ్రహం అవసరం అంటున్నారు. ధర్మ పరిరక్షణకు మేము సైనికులము అవుతా’ మని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు