పార్కింగ్‌ లేక పరేషాన్‌!

7 Feb, 2019 09:24 IST|Sakshi

సోమాజిగూడ: నగరంలోని అమీర్‌పేట్‌ మార్కెట్‌ పేరు తెలియని వారుండరు. అంతటి ఖ్యాతి గాంచిన మార్కెట్‌కు పార్కింగ్‌ సమస్య తలెత్తింది. అందుకు కారణం మెట్రోరైల్‌ నిర్మాణ పనులు తోడయ్యాయని చెప్పవచ్చు. అమీర్‌పేట్‌ చౌరస్తానుంచి పంజగుట్ట వచ్చే మార్గంలో ఎడుమ వైపు వాణిజ్య సముదాయాలు ఎక్కువ. వాటిలో ముఖ్యంగా బట్టల దుకాణాలే అధికం. షాపుల ముంగిట ప్రత్యేకంగా పార్కింగ్‌ సదుపాయం లేకపోవడంతో వినియోగదారులు తమ వాహనాలను అక్కడున్న ఫుట్‌పాత్‌పై పార్కు చేసేవారు. అయితే ప్రస్తుతం ఆయా ఫుట్‌పాత్‌లకు ఎల్‌అండ్‌ టీ అధికారులు రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. దీంతో షాపింగ్‌కు వచ్చేవారికి వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియక సతమతం అవుతున్నారు.  

షాపులకు పార్కింగ్‌ సదుపాయం లేదు
అమీర్‌పేటలోని వాణిజ్య సముదాయాలకు పార్కింగ్‌ సదుపాయం లేదు. దీంతో కార్లను కిలోమీటర్ల దూరంలో పార్కు చేసి షాపింగ్‌కు రావలసి వస్తోంది. పార్కింగ్‌ లేమితో అమీర్‌పేట్‌లోని వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 

హాకర్స్‌తో తలనొప్పి
కోట్లాది రూపాయల పెట్టుబడితో షాపులు నిర్వహిస్తున్న వారికి హాకర్స్‌తో మరో తలనొప్పి వస్తోంది. వస్త్రదుకాణాల ముంగిట హాకర్స్‌ బండ్లపై వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారు విక్రయించే వన్నీ రెడీమేడ్‌ దుస్తులే. దుకాణాల ముంగిట ఉన్నది ఫుట్‌పాత్‌ మాత్రమే. దీన్ని ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. వేలాది రూపాయిలు అద్దెగా చెల్లిస్తూ వ్యాపారాలు సాగక నానా ఇబ్బందులు పడుతున్నామని అక్కడి వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.

రోడ్డుపైనే బస్సులు నిలిపివేత..
మెట్రోరైల్‌ నిర్మాణ పనుల కారణంగా ప్రధాన రహదారి కుంచించుకు పోయి ఇరుకుగా మారింది. అటుగా వెళ్లే బస్సులు ప్రధాన రహదారిపైనే నిలిపేస్తున్నారు. షాపింగ్‌కు వచ్చిన వారు తమ వాహనాలను రోడ్లపైనే పార్కుచేయడంతో తరచూ ట్రాఫిక్‌ సమస్యతో వాహనాలు ఇరుక్కు పోతున్నాయి. గంటల తరబడి వాహనాలు ఎటూ వెళ్లే మార్గంలేక నానా ఇబ్బందులు తప్పడంలేదు.  

మరిన్ని వార్తలు