నా ఇంటి అల్లుణ్ని గెలిపించుకోవాలి : కడియం

25 Oct, 2018 17:56 IST|Sakshi

సాక్షి, నర్సంపేట : పెద్ది సుదర్శన్‌ రెడ్డి అభివృద్ధికి మారుపేరని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనియాడారు. రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేల కంటే నర్సంపేట అభివృద్ధే ధ్యేయంగా సుదర్శన్‌ నిధులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. గురువారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు భూమి పట్టాలు ఇప్పించిన ఘనత సుదర్శన్‌కు దక్కుతుందన్నారు. డాక్టర్‌ అంబేద్కర్‌ రచించిన ఆర్టికల్‌ 3 ద్వారానే తెలంగాణ తెచ్చుకున్నామని తెలిపారు.ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ రచించిన ఆర్టికల్ అనుగుణంగానే కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రాబోయే రోజుల్లో తయారు చేయబోతున్నాము. నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి ఏరోజు ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. నా ఇంటి బిడ్డను చేసుకున్న నా ఇంటి అల్లుడు అయిన పెద్ది సుదర్శన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలి’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు