ఓట్ల పండుగ.. జనం నిండుగ

12 Apr, 2019 13:04 IST|Sakshi
పేటలో పోలింగ్‌ వివరాలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

సాక్షి,మెదక్‌: మెదక్‌ నియోజకవర్గంలో గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల సాంకేతిక లోపంతో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. 273 పోలింగ్‌ కేంద్రాల్లో 72.84 శాతం పోలింగ్‌ జరిగింది. ఇందులో చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్‌  నమోదై నియోజకవర్గంలోనే ముందంజలో ఉంది. ఇక చిన్నశంకరంపేట  మండలంలో 75 శాతం పోలింగ్‌ కాగా రామాయంపేట మండలంలో 73.76 శాతం, నిజాంపేటలో 69.49 శాతం, పాపన్నపేట మండలంలో 71.46 శాతం,   రేగోడ్‌ మండలంలో  66 శాతం, పెద్దశంకరంపేట మండలంలో 69 శాతం, టేక్మాల్‌ మండలంలో 68.33 శాతం పోలింగ్‌ నమోదైంది. 

మెదక్‌ మున్సిపాలిటీ:
మెదక్‌ పట్టణంలో గురువారం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని 27 వార్డుల్లో మొత్తం 33 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలనుంచి ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్‌లో యువకులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించి ఓటింగ్‌ సరళిన అడిగి తెలుసుకున్నారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాలను ఆకట్టుకునేందుకు బెలూన్ల తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. నవాబుపేటలో మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్, ఆయన సతీమణి గాయత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే వైస్‌చైర్మన్‌ రాగి అశోక్‌ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు సెల్పీలు దిగుతూ సందడి చేశారు.  

శభాష్‌ పోలీస్‌ 
పార్లమెంట్‌ ఎన్నికల నేపధ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తుగా నిర్వహించిన పలువురు కానిస్టేబుళ్లు తమ సేవా ధృక్పదాన్ని చూపి పలువురి చేత శభాష్‌ పోలీస్‌ అనిపించుకున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే కేంద్రాలకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులను సేవలందించారు. నడవలేని వికలాంగులు, వృద్ధులను ఎత్తుకొని పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్లారు. 

మహిళల కోసం వెయింటింగ్‌ హల్‌..
చిన్నశంకరంపేట(మెదక్‌): ఓటు వేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాలి. అయితే  ఓ గ్రామ సేవకుడి ఐడియా మహిళలకు క్యూౖలో నిలబడె శ్రమను తప్పించింది.  మండలంలోని మడూర్‌లోని ఓ పాఠశాలలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుచేశారు. ఓటు వేసేందుకు వచ్చిన  వారి కోసం వెయింట్‌ హాల్‌ ఏర్పాటుచేశారు. దీంతో ఎండలో వచ్చినవారు వెయింట్‌ హాల్‌ కూర్చొని సేదతీరారు. గ్రామ సేవకుడు యాదగిరిని పలువురు అభినందించారు. 

మరిన్ని వార్తలు