కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం

11 Dec, 2014 02:13 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా’ పథకం కొందరికి ఆనందం కలిగించగా.. మరికొందరిని నిరాశకు గురిచేసింది. అనర్హులంటూ భారీ సంఖ్యలో పింఛన్‌లలో కోతలు పెట్టడంతో గతంలో పింఛన్లు పొందిన అనేక మంది తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈసారి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అనేక మంది పింఛన్లకు దూరమయ్యారు. తాము అన్నిరకాలుగా పింఛన్లకు అర్హులమైనప్పటికీ తమ పేర్లను జాబితా నుంచి ఎందుకు తొలగించారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్నాళ్లు పింఛన్లతో బతుకుపై భరోసా ఉండేదని, ఇప్పుడు భవిష్యత్తును తలుచుకుంటే తీవ్ర ఆందోళనగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వృద్ధాప్య పింఛన్లను ఐదు రెట్లు పెంచడం, వికలాంగుల పింఛన్లను మూడు రెట్లు పెంచడంపై ‘ఆసరా’ పథకం అర్హులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లుగా వచ్చిన పింఛన్ ఏ మూలకూ చాలదని ఇకపై ఎక్కువ మొత్తంలో పింఛన్ రానుండటంతో తాము ఎవరిపై ఆధారపడి బతకాల్సిన అవసరం లేకుండా పోయిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
బతుకు బండి నడిచేదెలా
మండలంలోని పీరంపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు శాగంటి ఎల్లమ్మ (70) భర్త చిన్నయ్య 15 ఏళ్ల క్రితం మృతిచెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులున్నా ఎవరూ ఎల్లమ్మను ఇప్పుడు ఆదరించడం లేదు. ఇన్నాళ్లు కూలీనాలి చేసుకొని బతికిన ఎల్లమ్మకు కొన్నాళ్లుగా కళ్లు సరిగా కనబడటం లేదు. ఇక గతంలో ఆమెకు వచ్చిన రూ. 200 పింఛన్ బతుకు బండి నడపడానికి ఆమెకు కొంత ఉపయోగపడేది.

బుధవారం పింఛన్లు వస్తాయని తెలుసుకొని ఎల్లమ్మ పంచాయతీ కార్యాలయానికి చేరుకుంది. కాని జాబితాలో తన పేరు లేదని తెలుసుకున్న ఆమె తీవ్ర నిర్వేదానికి లోనయ్యింది. ఇకపై తన బతుకు ఎలా గడిపేదంటూ తీవ్రంగా రోదించింది. జాబితాలో సవరణలుంటాయని, భవిష్యత్తులో పింఛన్ వచ్చే అవకాశముందని స్థానికులు సర్దిచెప్పడంతో రోదిస్తూనే ఎల్లమ్మ ఇంటిముఖం పట్టింది.
-కుల్కచర్ల
 
ఆసరా కోసం ఆవేదన

పింఛన్ మంజూరు కాలేదని ఆవేదనకు గురైన కొందరు ఎంపీడీఓ కార్యాల యానికి వచ్చి అధికారులను నిలదీశారు. తమకు అన్ని అర్హతలున్నా.. పింఛన్ ఎందు కు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని  సిరిపూరం, పంచలిం గాల గ్రామాల్లో బుధవారం స్థానిక ఎమ్మె ల్యే సంజీవరావు చేతులమీదుగా ఆసరా పథకాన్ని ప్రారంభించారు. మిగితా గ్రామా ల్లో గురువారం పింఛన్లు పంపిణీ చేస్తామం టూ అర్హుల జాబితాను ఆయా గ్రామ పం చాయతీల్లో అందుబాటులో ఉంచారు. అ యితే జాబితాలో పేరు లేని కొందరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకుది గారు. తమకు అన్ని అర్హతలున్నా.. పింఛన్ ఎందుకు మంజూరు చేయలేదో వివరించాలంటూ అధికారులను నిలదీశారు.
-మర్పల్లి
 
గతంలో పింఛను వచ్చేది ఇప్పుడు పేరులేదు
అధికారులు వారి తప్పిదాలతో మాలాంటి వికలాంగులను ఇబ్బంది పెడుతున్నారు.నాకు కొన్నేళ్లుగా పింఛన్ వస్తోంది. ఈసారి మాత్రం జాబితాలో నా పేరు లేదని అధికారులు చెబుతున్నారు. చాలామంది వికలాంగులు ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వికలాంగులను ఇబ్బందులకు గురిచేయవద్దు. వారికి తగిన న్యాయం చేయాలి.
 - మోసిన్, వికలాంగుడు, గండేడ్
 
58 శాతంవైకల్యం ఉన్నా..
ప్రభుత్వం కనీసం 40 శాతం వైకల్యం ఉంటే వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. 2007 నుంచి నాకు వికలాంగుల పింఛన్ అందుతోంది. నాకు 58 శాతం వైకల్యం ఉంది. అయినా నాకు పింఛన్ రాలేదు. పింఛన్ ఇస్తారన్న ఆశతో ఉదయం నుంచి పంచాయతీ కార్యలయం వద్ద పడిగాపులుగాస్తున్నా. చివరకు నాకు పింఛన్ రాదు పొమ్మని చెబుతున్నారు.
-ఎర్రోల్ల సుధాకర్, సిరిపూరం(మర్పల్లి)

మరిన్ని వార్తలు