స్పెషలిస్టు వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగ్‌ 

17 Nov, 2018 01:34 IST|Sakshi

     వైద్య విధాన పరిషత్‌లో మార్పులు షురూ 

     పోస్టింగ్‌ల ఖరారుకు ప్రత్యేక వెబ్‌ కౌన్సెలింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో అసంతృప్తితో ఉన్న స్పెషలిస్టు వైద్యులకు ప్రత్యేకంగా వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగులు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌన్సెలింగ్‌ శుక్రవారమే మొదలైందని వైద్య విధాన పరిషత్‌ వర్గాలు తెలిపాయి. 3 నెలల కిందట 919 మంది స్పెషలిస్టు వైద్యులను వైద్య విధాన పరిషత్‌ నియమించింది. అయితే అందులో 500 మందికి మించి విధులకు రావ డం లేదన్న విమర్శలు వచ్చాయి. మిగిలిన వారిలో కొందరు విధులకు డుమ్మా కొడుతుండగా, 128 మంది దూరాభారం అంటూ ఉద్యోగాలనే వదిలేసుకున్న పరిస్థితి నెలకొంది. విధులకు వెళ్లకుండా అసంతృప్తితో ఉన్న వారిని మళ్లీ దారి లో పెట్టాలని సర్కారు వెబ్‌ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేసింది.  

నచ్చిన చోట ఇవ్వలేదని:  వైద్య విధాన పరిషత్‌లో 911 మంది స్పెషలిస్ట్‌ వైద్యులను 31 జిల్లా ఆస్పత్రులు, 22 ఏరియా ఆస్పత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్‌లోని 14 ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్లలో భర్తీ చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా ఆర్థోపెడిక్, రేడియాలజీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్, జనరల్‌ మెడిసిన్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, పల్మనరీ, ఆప్తమాలజీ, సైకియాట్రిక్, ఎనస్తీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ, జనరల్‌ సర్జన్స్, ఓబీజీ, పీడియాట్రిక్స్‌ పోస్టులను భర్తీ చేశారు. కొందరికి సుదూర ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో అసలు సమస్య మొదలైంది.

సుదూర ప్రాంతాలకు భార్యాభర్తలను వేరు చేసేలా వేశారని కొందరు గగ్గోలు పెట్టారు. గతంలో ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుల పరిధిలోని వైద్యుల భర్తీలోనూ ఇలాంటి సమస్యే ఏర్పడితే వాటిని మార్చేందుకు ప్రత్యేకంగా దరఖాస్తులను ఆహ్వానించారు. ఏకంగా 250 మంది వరకు తమకు ఇచ్చిన పోస్టింగ్‌లను మార్చాలని కోరారు. దీంతో వారికి వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లను ఖరారు చేశారు. అలాగే వైద్య విధాన పరిషత్‌లోనూ నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మంది వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు