TS: నేడు, రేపు పలుచోట్ల వానలు

24 Nov, 2023 04:51 IST|Sakshi

పెరగనున్న చలి... 

రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి బలమైన గాలులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిశాయి. రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వస్తున్న బలమైన గాలుల ప్రభావం ఫలితంగా నెలకొన్న మార్పులతో ఈ వానలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రెండ్రోజులు కూడా రాష్ట్రమంతటా ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వానల కారణంగా వాతావరణం మరింత చల్లబడింది. దీంతో చలితీవ్రత వేగంగా పెరిగింది.  

సాధారణం కంటే తక్కువగా.. 
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో గరిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్‌గా, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయింది.

అలాగే నల్లగొండలో కనిష్ట ఉష్ణోగ్రత 18.4 డిగ్రీలు నమోదు కాగా, ఇక్కడ సాధారణం కంటే 2 డిగ్రీలు తగ్గింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. శుక్ర, శనివారాల్లోనూ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు