మూడుచోట్ల రాహుల్‌ సభలు! 

23 Mar, 2019 02:54 IST|Sakshi

పరిశీలనలో మల్కాజ్‌గిరి, నల్లగొండ, భువనగిరి, కరీంనగర్‌ 

చేవెళ్ల లేదా ఖమ్మంలో ప్రియాంక బహిరంగసభ?

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలను తీసుకువచ్చేలా టీపీసీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంకలతో మొత్తం నాలుగు బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి వీరి షెడ్యూల్‌పై కసరత్తు చేస్తున్నారు. ఈ వారంలో అగ్రనేతల పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. రాహుల్‌  సభలను ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణలుగా విభజించాలని, ఆయా ప్రాంతాల్లో ఒక్కో చోట సభ నిర్వహించాలని టీపీసీసీ నాయకత్వం యోచిస్తోంది.

ఇందుకోసం ఉత్తమ్, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేసే నియోజకవర్గాలైన నల్లగొండ, మల్కాజ్‌గిరి, కరీంనగర్, భువనగిరిల్లో భారీసభల ఏర్పాటుకు వ్యూహాన్ని ఖరారు చేస్తున్నా రు.  నల్లగొండ, మల్కాజ్‌గిరి, భువనగిరి, కరీంనగర్‌లలో 3 చోట్ల, వీలుకాని పక్షంలో కనీసం రెండు చోట్ల రాహుల్‌ పర్యటన ఖరారయ్యేలా షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు. ప్రియాంక సభ కోసం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తున్న చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని ఎంచుకుంటారనే చర్చ జరుగుతోంది. సాధ్యం కాని పక్షంలో ఖమ్మం లేదా హైదరాబాద్‌లలో ఆమె పాల్గొనే సభను ఖరారు చేయనున్నారు.  

మరిన్ని వార్తలు