రాష్ట్రంలో 2,98,64,689 మంది ఓటర్లు

17 Dec, 2019 03:17 IST|Sakshi

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2,98,64,689 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,50,07,047 మంది పురుషులు, 1,48,56,076 మంది మహిళలు, 1,566 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2020లో భాగంగా సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ ప్రకటించారు. ఈ కార్యక్రంలో భాగంగా వచ్చే నెల 15 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, తప్పుల సవరణకు దరఖాస్తులతో పాటు కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జనవరి 27 నాటికి ఈ దరఖాస్తులను పరిష్కరించి ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.

2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు కలిగి ఉండి, ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని రజత్‌కుమార్‌ సూచించారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 105 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. దీంతో మొత్తం పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 34,707కి పెరిగిందని రజత్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

మరిన్ని వార్తలు