రేషన్‌లో కోత!

11 Jul, 2014 23:34 IST|Sakshi
రేషన్‌లో కోత!

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యం, కిరోసిన్ కోటాకు కోత పడనుంది. తెల్ల రేషన్‌కార్డుదారులకు వచ్చే నెల నుంచి రేషన్ కట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆధార్ వివరాలతో సరిపోని, గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారులకు ఈ నిబంధన వర్తింపజేయనున్నారు. బోగస్ యూనిట్లుగా తేలినవారికి నాలుగు కిలోల బియ్యం, గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి లీటర్ కిరోసిన్ కోత విధించనున్నారు. ప్రాథమిక అంచనాల మేరకు వచ్చే నెల రేషన్‌లో దాదాపు 800 టన్నులకు పైగా బియ్యం, 2.70 లక్షల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది.
 
  ఇందుకు సంబంధించి అన్ని వివరాలను ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ ఇప్పటికే సేకరించినట్టు సమాచారం. ఈ సమాచారాన్ని మండలాలకు పంపి, మరోసారి పరిశీలన జరిపి బియ్యం, కిరోసిన్ కోటాలో కోత పెట్టనున్నారు. వాస్తవానికి జిల్లాలో ఉన్న కుటుంబాల కన్నా రేషన్‌కార్డులు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోనికి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా తెల్లకార్డుల విషయంపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. బోగస్ కార్డులుంటే తీసేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ ద్వారా కార్డుదారుల వివరాలను జిల్లా యంత్రాంగం సరిపోల్చింది.
 
 జిల్లాలో 97 శాతం మందికి ఆధార్ నంబర్లు వచ్చినా ఇందులో 74 శాతం మంది వివరాలను మాత్రమే రేషన్‌కార్డులతో పోల్చిచూశారు. అలా చూస్తే దాదాపు జిల్లాలో 2 లక్షల బోగస్ యూనిట్లు ఉన్నట్టు తేలింది. అంటే... ఒకే వ్యక్తి పేరు.. రెండు, మూడు కార్డుల్లో ఉండడం, కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం... కుటుంబ యజమానుల పేర్లు కుటుంబ సభ్యుల పేరిట జారీ అయిన కార్డుల్లో ఉన్నాయని తేలింది. జిల్లాలో 7,80,100 రేషన్‌కార్డులు ఉండగా... వీటిలో 6.5 లక్షలు తెల్లరేషన్‌కార్డులున్నాయి.
 
 ఇప్పటివరకు అధికారులు సేకరించిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ఐదు శాతం, పట్టణ ప్రాంతంలో 10 శాతం బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విధంగా జిల్లాలో సుమారు 2 లక్షల యూనిట్లు బోగస్ ఉన్నట్లు తేలింది. (రేషన్‌కార్డులో ఉన్న ఒక వ్యక్తి ఒక యూనిట్ కింద లెక్క) అంటే ఒక్కో యూనిట్‌కు నాలుగు కిలోల బియ్యం ఇప్పటివరకు ఇస్తున్నారు. వీరందరికీ ఆ నాలుగు కిలోల బియ్యాన్ని నిలుపుదల చేయనున్నారు. జిల్లాలో వచ్చే నెల బియ్యం కోటాలో 8 లక్షల కిలోల బియ్యం(800 టన్నులు) తగ్గనుంది. తద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.1.3 కోట్లు ఆదా కానున్నాయి. వాస్తవానికి రేషన్ ద్వారా ఇచ్చే బియ్యాన్ని ప్రభుత్వం కిలోకు రూ.25 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఇందులో రూ.8 కేంద్రం భరిస్తుండగా, మరో రూపాయి కార్డుదారుడి నుంచి వసూలు చేస్తున్నారు. అంటే కిలో బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 16 చెల్లించాల్సి వస్తోంది. వచ్చే నెల నుంచి 8 లక్షల కిలోల బియ్యం తగ్గితే ప్రభుత్వానికి కిలోకు రూ.16 చొప్పున 1.3 కోట్ల మేరకు ఆదా కానుంది.
 
 గ్యాస్ ఉంటే కిరోసిన్ లేదు..
 తెల్లకార్డుల ద్వారా ఒక్కో కుటుంబానికి నె లకు రెండు లీటర్ల కిరోసిన్ ఇస్తున్నారు. అయితే, నిబంధనల ప్రకారం గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబానికి కేవలం లీటర్ కిరోసిన్ మాత్రమే ఇవ్వాలని అధికారులు చెపుతున్నారు. ఈ కారణంతో ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల నుంచి మండలాలవారీగా గ్యాస్ క నెక్షన్ల వివరాలను జాయింట్ కలెక్టర్ తెప్పించుకున్నారు. ఈ వివరాలను మండల స్థాయిలో తహశీల్దార్లకు పంపనున్నారు. తహశీల్దార్లు గ్రామాల వారీగా గ్యాస్ కనెక్షన్ వివరాలను పరిశీలించి ఏ కార్డుదారునికి ఎంత కిరోసిన్ ఇవ్వాలో నిర్ణయించనున్నారు. ఈ మేరకు తహశీల్దార్లు జిల్లా అధికారులకు ఈ నెల 16వ తేదీలోపు అన్ని వివరాలు పంపించాల్సి ఉంటుంది.
 
 ఈ విషయంలో ఎక్కడా తప్పులు జరగకుండా ఉండేందుకు గాను తహశీల్దార్ల నుంచి వ్యక్తిగత పూచీకత్తు కూడా తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ విధంగా గ్యాస్‌కు, కిరోసిన్‌కు లింకు పెట్టడం ద్వారా వచ్చే నెల 2 లక్షల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. లీటర్‌కు ప్రభుత్వంపై పడే రూ.15 భారం తగ్గనుంది. అంటే మరో రూ.40 లక్షలు కిరోసిన్ కోత ద్వారా ప్రభుత్వానికి ఆదా కానుందన్న మాట.
 

మరిన్ని వార్తలు