రైలు ఢీకొని రిటైర్డ్‌ ఏఎస్సై దుర్మరణం

26 Jun, 2019 11:27 IST|Sakshi

సాక్షి,కేసముద్రం: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ రిటైర్డ్‌ ఏఎస్సై దుర్మరణం చెందిన సంఘటన మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ మురళీ తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్‌ జిల్లా సుభాష్‌నగర్‌కి చెందిన రిటైర్డ్‌ ఏఎస్సై కోదాది వీరలింగం(62) తన బావమరిదికి బిడ్డ పుట్టగా, చూసేందుకుగాను రెండురోజుల క్రితం మానుకోటలోని ఆస్పత్రికి భార్యతో కలిసివచ్చాడు. అదే రోజు తిరిగి అత్తగారి ఊరైన కేసముద్రంస్టేషన్‌కు చేరుకున్నాడు.

సోమవారం సాయంత్రం కేసముద్రంస్టేషన్‌లో గాంధీసెంటర్‌ వైపు ఉంటున్న అన్న ఇంటికి వెళ్లాడు. అనంతరం రైల్వేట్రాక్‌కు మరోవైపు ఉన్న అత్తగారింటికి వెళ్లేందుకు అర్థరాత్రి 11.30 గంటల ప్రాంతాన నడుచుకుంటూ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. పుట్‌ఓవర్‌ బ్రిడ్జిపై కోతులు ఉండటంతోపాటు, తనకు మోకాళ్ల నొప్పులుండటంతో రైల్వేట్రాక్‌పై నడుచుకుంటూ 2వ ప్లాట్‌ఫాం వైపుకు వెళ్తుండగా మెయిన్‌లైన్‌ (డౌన్‌లైన్‌)లో వెళ్లే గరీభ్‌రధ్‌ ఎక్స్‌ప్రెస్‌ వీరలింగంను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించినట్లు జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

మరిన్ని వార్తలు