జాతర మిగిల్చిన విషాదం

2 Feb, 2018 16:52 IST|Sakshi
రోదిస్తున్న మృతురాలి కుటుంబసభ్యులు, చిలుక అరుణ(ఫైల్‌)

సమ్మక్క జాతరకు వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా

ఒకరు మృతి.. 12మందికి గాయాలు

సుల్తానాబాద్‌ మండలంలో ఘటన  

సుల్తానాబాద్‌(పెద్దపల్లి) : పండుగపూట పెద్దపల్లి జిల్లాలో విషాదం అలుముకుంది. సుల్తానాబాద్‌ మండలం రేగడిమద్దికుంట గ్రామంలోని సబ్‌స్టేషన్‌ సమీపంలో జాతరకు వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ మ హిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 12 మంది గాయపడ్డారు. సీఐ రాములు వివరాల ప్రకారం.. ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కనుకుంట్ల నారాయణ, స్వామి కుటుంబసభ్యులు గురువారం ట్రాక్టర్‌లో ఓదెల మండలం కొలనూర్‌ సమ్మక్క, సారలమ్మ జాతరకు బయల్దేరారు. సుల్తానాబాద్‌ మండలం రేగడిమద్దికుంటకు చేరుకోగానే అతివేగంగా వెళ్తూ ట్రాక్టర్‌ ఒక్కసారిగా బోల్తా పడింది.ట్రాలీలో కూర్చున్న వారిలో చిలుక అరుణ(38) అక్కడికక్కడే మృతి చెందింది. కనుకుంట్ల స్వరూప, కనుకుంట్ల లచ్చమ్మ, కనుకుంట్ల అక్షిత, కనుకుంట్ల మల్లమ్మ, కస్తూరి, కంకటి శ్రీలత, రాజమ్మ, లలిత, పుష్ప, తిరుమల, లక్ష్మి, సాత్విక, శివకుమార్‌  తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గొట్టె ముక్కుల సురేష్‌రెడ్డి తనవాహనంలో సుల్తానాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రథమచికిత్స అందించి కరీంనగర్‌ తరలించారు. ఘటనాస్థలాన్ని సీఐ రాములు పరిశీలించి వివరాలు సేకరించారు.

కుటుంబంలో విషాదం
చిలుక అరుణ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. అరుణకు భర్త వెంకటస్వామి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.కాగా మృతురాలి కుటుంబానికి రూ.లక్ష  ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి ప్రకటించారు.


 

>
మరిన్ని వార్తలు