ఆర్టీసీ సమ్మె : అవసరమైతే తెలంగాణ బంద్‌ 

9 Oct, 2019 16:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌​ : ఆర్టీసీ సమ్మెపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి  ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రజా సంఘాలు, బీజేపీ నుంచి రామచంద్రారావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తదితరులు హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. వంట వార్పు, తెలంగాణ బంద్‌, గవర్నర్‌, కేంద్ర మంత్రులను కలవడం లాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ యోచిస్తోంది. రేపు అన్ని పక్షలతో మాట్లాడిన తర్వాత బంద్‌ తేదిని ప్రకటించనున్నారు. 

(చదవండి : ఆర్టీసీ ఆపరేషన్‌ షురూ!)

భేటీ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వినర్‌ అశ్వత్ధామరెడ్డి మాట్లాడుతూ.. రేపు అన్ని డిపోల వద్ధ ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు ప్రజలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని కోరారు. ప్రభుత్వ తీరు మారకుంటే తమ సమ్మెను మరింత ఉదృతం చేస్తామన్నారు. అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు.

కోదండరామ్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము పూర్తి మద్దతుగా ఉంటామన్నారు. కేసీఆర్‌ తీరు మారకుంటే ఆర్టీసీ సమ్మె సకలజనుల సమ్మెగా మారుతుందని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ బంద్‌పై రేపు మధ్యాహ్నం ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన ఆర్టీసీ కార్మికులకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు ఇవ్వాలని కోరారు.  

మరిన్ని వార్తలు