అధ్యయనమా..!ఆటవిడుపా?

18 Oct, 2014 01:36 IST|Sakshi

నేటి నుంచి సింగరేణి బృందం విదేశీ పర్యటన
గతంలో రెండుసార్లు వెళ్లొచ్చినా ఫలితం శూన్యం


సింగరేణి బృందం ముచ్చటగా మూడోసారి విదేశీయూత్రకు శనివారం బయల్దేరనుంది. 11 మందితో కూడిన ఈ బృందం అక్టోబర్ 31 వరకు దక్షిణాఫ్రికా, పోలండ్, మొజాంబిక్ దేశాల్లో పర్యటిస్తుంది. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఈ బృందం పర్యటనకు సింగరేణి అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ టూర్ ఫలితం ఎలా ఉండబోతోందనేదే ఇప్పుడు చర్చనీయూంశమైంది. గత టూర్ల అనుభవాల నేపథ్యంలో.. వీరు వెళ్తోంది అధ్యయనానికా? లేక ఆటవిడుపుకా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
 
గతం పునరావృతమవుతుందా?
ఆస్ట్రేలియూ, చైనా పర్యటనలకు వెళ్లొచ్చిన బృందాలు నాడు చేసిన అధ్యయనమేంటో నేటికీ వెలుగుచూడలేదు. 2013లో ఆస్ట్రేలియాలోని పెర్త్, సింగపూర్, ఇతర ప్రాంతాల్లోని బొగ్గు గనుల్లో సింగరేణి అధ్యయన బృందం పర్యటించింది. ఆస్ట్రేలియాలోబొగ్గు గనులన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ‘గిర్‌ఫిన్ కాలరీస్’ ఆధ్వర్యంలోని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును, సీఎస్‌పీని, వర్క్‌షాపును ఈ బృందానికి చూపించారు. ఇవి పూర్తిగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ప్రాజెక్టులే.
     
వీటిలో ప్రమాదాలు జరగకుండా శాటిలైట్ ద్వారా నిత్యం పర్యవేక్షిస్తారు.
సీఎస్పీల వద్ద బొగ్గు దుమ్ము లేవకుండా బెల్ట్‌పై సీల్డ్‌కవర్ తొడిగారు.
అంతర్గతంగా బొగ్గుపై నీటిని చల్లుతూ ఉంటారు.
సింగరేణిలో సీఎస్పీలలో దుమ్ము లేవకుండా నామమాత్రపు చర్యలు చేపడుతున్నారు.
ఆస్ట్రేలియాలో గనిలో గాయపడిన కార్మికుడికి తను పొందే జీతంలో 75 శాతాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారాజీవితాంతం చెల్లిస్తారు.
సింగరేణిలోనైతే కార్మికుడికి సంస్థ కనీసం వైద్యసేవ లు అందించడం కష్టమే.
ఆస్ట్రేలియాలో గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని హెలికాప్టర్‌లో ఆస్పత్రులకు తరలిస్తారు.
సింగరేణిలో కనీసం అంబులెన్స్‌లనూ వినియోగించరు.
అక్కడి గనుల్లోకి వెళ్లే కార్మికులు ప్రత్యేక దుస్తులు, కళ్లద్దాలు, టోపీ, బూట్లు ధరిస్తారు.
సింగరేణిలో టోపీ, బూట్లు తప్ప మరేమీ ఇవ్వరు.
ఆస్ట్రేలియా బొగ్గుగనుల్లో బ్లాస్టింగ్ చేయరు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ద్వారా బొగ్గు తీస్తుంటారు.
సింగరేణిలో చాలా గనుల్లో బ్లాస్టింగ్ చేస్తుంటారు.
అక్కడ కార్మికుల ప్రాణాలకు అత్యంత విలువనిస్తారు.
సింగరేణిలో మాత్రం బొగ్గు ఉత్పత్తికే ఎక్కువ ప్రాధాన్యత.
ఇక్కడ ఏటా 14 నుంచి 18 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సుమారు రూ. 30 లక్షలు ఖర్చు చేసి ఆరుగురు కార్మిక నాయకులు, నలుగురు అధికారులు ఆస్ట్రేలియాకు వెళ్లి సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ చర్యలు, కార్మిక సంక్షేమం గురించి తెలుసుకున్నా.. దాన్ని సింగరేణిలో అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది.

>
మరిన్ని వార్తలు