దేశం దృష్టిని ఆకర్షించేలా సోమశిల

22 Nov, 2019 04:26 IST|Sakshi
లాంచీని ప్రారంభిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌: దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించే పర్యాటక ప్రాంతంగా సోమశిలను తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని సోమశిల వద్ద కృష్ణా బ్యాక్‌వాటర్‌లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన నూతన బోటును, కాటేజీలను ప్రారంభించారు. అనంతరం బోటులో సోమశిల నుంచి సిద్ధేశ్వరం, అమరగిరి తదితర ప్రాంతాలను వీక్షించారు.

అనంతరం బోటులోనే మంత్రి విలేకరులతో మాట్లాడారు. కొల్లాపూర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని అర్హతలు, అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకప్పుడు నక్సల్స్, గ్రేహౌండ్స్‌ దళాల కాల్పులతో దద్దరిల్లిన కొల్లాపూర్‌ ప్రాంతం.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కొల్లాపూర్‌ను ఎకో టూరిజం సెంటర్‌గా మారుస్తామన్నారు. కృష్ణా నది తీరంతో కనువిందు చేస్తున్న సోమ శిల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. సోమశిల–సిద్ధేశ్వరం వంతెన నిర్మాణం విషయంలో ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు కలసి ముందుకెళ్తాయని చెప్పారు.  

మరిన్ని వార్తలు