సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు విచారణకు ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు భవనంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలోని ఎన్ఐఏ కోర్టులో సాగుతోంది. ఇక్కడికి నిందితులను తరలించడం, తిరిగి జైలుకు తీసుకెళ్లడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. భద్రతాకారణాల దృష్ట్యా రంగారెడ్డి కోర్టు భవనంలోకి ఎన్ఐఏ కోర్టును మార్చాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో తదుపరి ఈ కేసు విచారణ ఎల్బీనగర్లో జరుగనుంది.
ఈ కేసులో అరెస్టు అయిన ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, తెహసీన్, హడ్డీ, వఖాస్లు చర్లపల్లి జైల్లో.. ఎజాజ్ షేక్ ఢిల్లీ, అఫాఖీ, సద్దాం బెంగుళూరు జైలులో ఉన్నారు. వహీద్ అనే మరో అనుమానితుడు దుబాయ్లో ఉగ్ర కేసులో పట్టుబడి అక్కడి జైలులో ఉంటున్నాడు. ఈ కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఎన్ ఐఏ అధికారులు ఇతర రాష్ట్రాల జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను ఇక్కడికి తరలించేందుకు సిద్ధమవుతున్నారు.