ఎన్నికల ఇంకు గురించి తెలుసా..?

21 Mar, 2019 12:11 IST|Sakshi

సాక్షి, కోదాడ : ఎన్నికల సమయంలో  దొంగ ఓట్లను నివారించడానికి, ఒకరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా ఉండడానికి ఎన్నికల సంఘం ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై ఇంకు గుర్తును వేస్తుంది. ఇది దాదాపు నెల రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. ఈ ఇంకుకు పెద్ద చరిత్రనే ఉంది. దేశంలో జరిగిన 3వ సాధారణ ఎన్నికల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశం మొత్తానికి అవసరమైన ఈ  ఇంకును ఒక్క కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. 1937 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌ పట్టణంలో ఈ ఇంకు తయారీ పరిశ్రమను  ‘‘ మైసూర్‌ ల్యాక్‌ అండ్‌ పెయింట్స్‌ ’’ పేరుతో స్థాపించారు. మహా రాజ నల్‌వాడీ కృష్ణరాజ వడయార్‌ దీని వ్యవస్థాపకుడు. తర్వాత దీన్ని మైసూర్‌ పెయింట్స్‌ వార్నిష్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ కంపెనీ కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది.

1962 నుంచి ఎన్నికల సంఘం తమకు అవసరమయ్యే ఇంకును ఈ పరిశ్రమ నుంచి మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఇది 5, 7, 5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్‌ బాటిల్‌ 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఈ పరిశ్రమ ఈ ఇంకును ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తుంది. మారుతున్న కాలంతో పాటు ఈ పరిశ్రమ కూడా ఆధునికీకరణ చెందింది. ఈ ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్‌ పెన్నులను కూడా తయారీ చేస్తుంది. ఇతర దేశాలలో వీటిని వాడుతున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ ఇంకు  తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్‌ ఫిజికల్‌ లాబోరేటరీ ఆఫ్‌ ఇండియా అత్యంత రహస్యంగా రూపొం ది స్తుంది.  ఇతరులకు దీని తయా రీ తెలియనీయరు.   

మరిన్ని వార్తలు