కలెక్టర్ల నుంచి క్లియరెన్స్‌ వచ్చాకే..

29 Apr, 2019 06:19 IST|Sakshi

జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఏకగ్రీవాలను ప్రకటించాలి

రిటర్నింగ్‌ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల నుంచి క్లియరెన్స్‌ వచ్చాకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఏకగ్రీవాలను రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈ సీ) ఆదేశించింది. పదవుల వేలం, నామినేషన్లు వేయ కుండా అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి అభ్యర్థులపై ఒత్తిళ్లు తేవ డం వంటి ఆరోపణలపై వచ్చే ఫిర్యాదులు, పత్రిక లు, మీడియాలో వచ్చే వార్తల పరిశీలనకు జిల్లాలో కలెక్టర్‌ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.

చట్టంలోని అంశాల ప్రాతిపదికన కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, డీసీపీలు విచారణ జరిపి, ఇందులో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పదవుల వేలం, నామినేషన్లు వేయకుం డా అభ్యర్థులను బెదిరించడం, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి ప్రాథమిక ఆధా రాలున్న సందర్భాల్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సాధారణ పరిశీలకులు ఎస్‌ఈసీకి నివేదికలు పంపించాలని తెలపింది. వీటికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు పూర్తిగా సంతృప్తి చెందాకే ఏకగ్రీవాలకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది.

పదవుల వేలం, ఒత్తిళ్లు, బెదిరింపులు చోటుచేసుకున్న చోట తదుపరి ఆజ్ఞల కోసం ఎస్‌ఈసీకి నివేదిక పంపించాలని ఆదేశించింది. పరిషత్‌ నోటిఫికేషన్‌లో భాగంగా తొలి విడత ఎన్నికలకు ఆదివారం (28న), రెండో విడతకు మే 2న, మూడో విడతకు మే 6న పోటీచేసే అభ్యర్థుల జాబితాలను సాయంత్రం 3 గంటల తర్వాత ప్రచురించాల్సిన నేపథ్యంలో ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆదివారం ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్, ఇతర సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపించారు.   

మరిన్ని వార్తలు