శస్త్రచికిత్సతో వినికిడి లోపం మాయం

6 Mar, 2018 04:04 IST|Sakshi
వినికిడి యంత్రాన్ని అమర్చిన చిన్నారితో వైద్యులు

ఆరేళ్ల బాలునికి హైరెన్‌ ఆల్ట్రా కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌

దేశంలోనే ఇది తొలిదని డాక్టర్‌ వినయ్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారికి ‘హైరెన్‌ ఆల్ట్రా కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌’వినికిడి శక్తిని ప్రసాదించింది. దేశంలోనే ఈ తరహా ఇంప్లాంటేషన్‌ ఇదే తొలిదని ప్రముఖ కాక్లి్లయర్‌ ఇంప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఈసీ వినయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన చికిత్స వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన నర్సింగరావు, నిత్య కుమారుడు యశ్వంత్‌(6) పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అపోలో ఆస్పత్రి డాక్టర్‌ వినయ్‌కుమార్‌ను సంప్రదించారు.

ఆయన కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ ద్వారా వినికిడి శక్తితో పాటు మాటలను తెప్పించవచ్చని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో దేశంలోనే తొలిసారిగా దీన్ని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో యశ్వంత్‌కు విజయవంతంగా అమర్చారు. ఈ సర్జరీ సులువుగా, సురక్షితంగా నిర్వహించామని డాక్టర్‌ వినయ్‌ చెప్పారు. మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతి చిన్న సాధనాల్లో ఇది కూడా ఒకటి కావడం వల్ల పిల్లలకు సరిగ్గా అతుకుతుందన్నారు. ఈ పరికరాన్ని ఎముక, చర్మానికి మధ్యలో పెడతారని తెలిపారు. ఉత్తమ వినికిడికి వీలుగా విస్తృత స్థాయిలో శబ్దాలను గ్రహిస్తుందని చెప్పారు.
 

మరిన్ని వార్తలు