సండ్ర, పువ్వాడ అజయ్‌పై లోక్‌పాల్‌లో ఫిర్యాదు

22 May, 2019 19:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పువ్వాడ అజయ్‌లపై లోక్‌పాల్‌లో ఫిర్యాదు నమోదు అయింది. ఖరీదైన ప్రభుత్వ స్థాలాలను కబ్జా చేసి కేసీఆర్‌ ప్రభుత్వంతో క్రమబద్దీకరణ చేయించుకున్నారంటూ తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్‌ ఫిర్యాదు చేశారు. రాజకీయ అవినీతికి పాల్పడ్డారని, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరీదైన ప్రభుత్వ స్థలాలను జీవో నెం.5 ద్వారా తక్కువ ధరకు కట్టబెట్టారని తన ఫిర్యాదులో పేర్కొన‍్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు రాజకీయ అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్‌ఫై, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్‌ స్థలాల తాయిలాలకు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి లొంగిపోయారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీలోకి విలీనానికి సంతకం పెట్టిన మొత్తం 11మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్లు మానవతా రాయ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు