చెత్త గురించీ చెప్పలేరా? 

8 Mar, 2020 03:17 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ తీరుపై హైకోర్టు ఆగ్రహం 

సాక్షి, హైదరాబాద్‌: చెత్త తొలగింపునకు తీసుకున్న చర్యలు గురించి వివరిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో అరకొర సమాచారం ఉందని హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ దుర్గంధంగా మారి పరిసర ప్రాంతాలకు దుర్వాసన, దోమలు వ్యాప్తి చెందుతున్నాయని పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని నగరానికి చెందిన సీతారామరాజు లేఖ ద్వారా హైకోర్టు దృ ష్టికి తెచ్చారు. దీనిని ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణిం చి హైకోర్టు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ జరిపింది. జ వహర్‌నగర్‌ నుంచి డంపింగ్‌ యార్డ్‌ తరలింపునకు మూడు ప్రత్యామ్నాయ స్థలాలను..గు ర్తించినా కదలిక లేదని వ్యాఖ్యానించింది.

‘పటాన్‌చెరు మండ లం లక్దారంలో 150 ఎకరాలను జీహెచ్‌ఎంసీ గుర్తిస్తే ఆ భూమిని రాజీవ్‌ గృహకల్పకు కేటాయించినట్లుగా కలెక్టర్‌ లేఖ రాశారు. గుమ్మడిదల మండల ప్యానానగర్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన 152 ఎకరాల భూమి ఉంది. అయితే రోడ్డు నిర్మాణం కోసం 2.12 ఎకరాల్ని కేటాయించాలని గత ఏడాది సెప్టెంబర్‌లో అటవీశాఖకు లేఖ రాస్తే ఇప్పటి వరకు అనుమ తి రాలేదు. తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో 42.22 ఎకరాలను జీహెచ్‌ఎంసీ గుర్తించినా దానిని స్వాధీనం చేసుకోలేదు’ అని కమిషనర్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారంటే ప్రత్యామ్నాయ స్థలాల్లో పనులేమీ మొదలు కాలేదని స్పష్టం అవుతోందని ధర్మాసనం పే ర్కొంది. హైకోర్టులో పిల్‌ దాఖలైన తర్వాత గత 8 నెలలుగా సమావేశం కాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.

చెత్తను తొలగించేందుకు 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను మంజూరు చేసినట్లు చెప్పారేగానీ వాటిని ఎ క్కడ వినియోగిస్తున్నారో, ఫలితాలెలా ఉన్నాయో చె ప్పలేదని తప్పుపట్టింది. తడి, పొడి చెత్తలకు విడివిడి గా డబ్బాలను ఏర్పాటు ఫలితాల గురించిగానీ, వాణిజ్య ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా చెత్త డబ్బాలను వినియోగించని వారు, వారికి విధించిన జ రిమానాల గురించి సమాచారం అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) నెలకు రెండుసార్లు జీహెచ్‌ఎంసీకి ఇచ్చే నివేదికలను అఫిడవిట్‌తో జత చేశా రని, అవి అర్ధమయ్యేలా లేవని పేర్కొంది. విచారణ ను ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు