రేషన్‌ కార్డు లేకుంటే..?

6 May, 2020 03:32 IST|Sakshi

నిత్యావసరాలు ఇవ్వరా?: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌లో చిక్కుకున్న వారికి రేషన్‌ కార్డులు లేకపోయినా ప్రభుత్వం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల రేష న్‌ కార్డులు జారీ అయినా వాటిలో మూడొంతులు తిరస్కరణకు గురయ్యాయని, రేషన్‌ కార్డు చూపిస్తేనే రేషన్‌ ఇస్తామని అధికారులు చెప్పడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలిపింది. హైదరాబాద్‌లో 20.6 లక్షల తెల్ల రేషన్‌ కార్డులు జారీ అయినా వాటిలో 17.6 లక్షల కార్డులను అధికారులు తిరస్కరించారని, దీంతో రేషన్‌ కార్డు లేని వారికి నిత్యావసర వస్తువులు అందట్లేదంటూ సా మాజిక కార్యకర్త ఎస్‌క్యూ మసూద్‌ రాసిన లేఖను హైకోర్టు ప్ర జాహిత వ్యాజ్యం (పిల్‌)గా పరి గణించింది.

ప్రభుత్వ వివరణ కోసం విచారణను ఈ నెల 8కి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గత నెల ప్రభుత్వ నివేదికలో హైదరాబాద్‌లోనే భారీ స్థాయిలో కార్డులు తిరస్కరించారని, లాక్‌డౌన్‌ వేళ వలస కార్మికులు, ఇతరులు రేషన్‌ కార్డులు ఎలా చూపించగలరని ప్రశ్నించింది. ని త్యావసరాలు ఇవ్వాలంటే రేషన్‌ కార్డు చూపాలని అధికారులు ఒత్తిడి చేయడం తగదంది.  లాక్‌డౌన్‌ వేళ అంద రినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన ని స్పష్టం చేసింది. వలస కార్మికులను కూడా ప్రభుత్వం ఆదుకుందని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు