ఇసుక స్థావరాలపై దాడులు

27 Aug, 2018 10:41 IST|Sakshi
సీజ్‌ చేసిన ఇసుక లారీలు  

3 లారీలు, ట్రాక్టర్, టిప్పర్‌ల సీజ్‌

చిన్నకోడూరు(సిద్దిపేట) : అక్రమ ఇసుక స్థావరాలపై ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 3లారీలను, ఒక ట్రాక్టర్, ఒక టిప్పర్‌ను సీజ్‌ చేశారు. మండల పరిధిలోని అల్లీపూర్‌ శివారులో రహస్య ప్రాంతాల్లో ఇసుక అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు సమచారం అందుకున్న సిద్దిపేట రూరల్‌ సీఐ సైదులు, ఎస్‌ఐ అశోక్‌లు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.

అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌లను సీజ్‌ చేశారు. ఇసుక డంప్‌లు నిర్వహిస్తున్న నిర్వాహకులు అనిల్, సంతోష్, బాలయ్య, తిరుపతిరెడ్డి, మహేందర్‌లపై కేసునమోదు చేశారు. అనిల్‌కు సంబంధించిన టిప్పర్‌ సీజ్‌ చేశారు. అలాగే సిరిసిల్ల రాజన్న జిల్లా కొదురుపాక క్వారీ నుంచి హైదరాబాద్‌ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3లారీలు, ఒక ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రూరల్‌ సీఐ సైదులు, ఎస్‌ఐ అశోక్‌లు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా ఇసుక నిల్వలు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే అక్రమ వ్యాపారాలు కొనసాగించినా వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు