ముగ్గురు ఎన్డీ దళసభ్యుల అరెస్ట్‌

25 Mar, 2018 07:39 IST|Sakshi
అరెస్టు చేసిన దళసభ్యులతో ఓఎస్‌డీ, పక్కన డీఎస్పీలు, సీఐలు

పాల్వంచరూరల్‌:  సీపీఐ (ఎంఎంల్‌) న్యూడెమోక్రసీ రామన్న దళానికి చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేసి, వారి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  ఓఎస్డీ ఉత్తమకుమార్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పాల్వంచ మండలం ఉల్వనూరు అటవీ ప్రాంతంలో రాళ్లవాగు పరిసర ప్రాంతాల్లో దళం సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న సీఐ రఘవేంద్రరావు, ఎస్‌ఐ ఎం.రమేష్‌ సిబ్బంది శనివారం గాలింపు చేపట్టగా అనుమానాస్పద స్థితిలో తారసపడిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఎన్‌డీకి చెందిన రామన్న దళంలో సభ్యులుగా ఉన్న బూర్గంపాడు మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన కోవాసి బుద్రు అలియాస్‌ సురేష్, అశ్వాపురం మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన మడివి ఉంగి, ఎలియాస్‌ కవిత, రోజా, భవాని, పాల్వంచ మండలం రెడ్డిగూడేనికి చెందిన వీరమల్ల సురేష్‌ను అరెస్టు చేసి వారి వద్ద రైఫిల్, ఫిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గత ఏడాది నర్సంపేటలో జరిగిన రాయల భాస్కర్‌ హత్యకేసులో, 2017లో బోడు ప్రాంతంలో పోలీసులకు ఎన్‌డీ దళానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఈ ముగ్గురూ ఉన్నారని తెలిపారు. సమావేశంలో పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసరావు, మణుగూరు డీఎస్పీ సాయిబాబా, సీఐ రాఘవేంద్రరావు, అశ్వారావుపేట సీఐ అబ్బయ్య, ఎస్‌ఐ ఎం.రమేష్‌ పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు