ఇంతింతై.. ఎనిమిదింతలై..

7 May, 2015 03:10 IST|Sakshi

పెరగనున్న ‘గౌరవెల్లి’ జలాశయం సామర్థ్యం
1.4 నుంచి 8 టీఎంసీలకు పెంపుపై కసరత్తు
మహాసముద్రం గండి పూడ్చివేతపై దృష్టి
నేడు సందర్శించనున్న మంత్రి హరీష్‌రావు
పరిహారం, పునరావాసం కోసం నిర్వాసితుల డిమాండ్

హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ మండలంలో నిర్మించ తలపెట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యం పెంపుపై సర్కారు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని సామర్థ్యాన్ని ఎనిమిదింతలు పెంచేందుకు నిర్ణయించినట్లు సమాచారం. మరిన్ని గ్రామాలు ముంపునకు గురికాకుండా... పెద్దగా ఆర్థిక భారం పడకుండానే ఈ సామర్థ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు అందజేసినట్లు తెలిసింది. కాగా.. గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.4 టీఎంసీ నుంచి 8 టీఎంసీలకు పెంచేందుకు మంత్రి హరీశ్ రావు సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలంగాణ వికాస సమితి నాయకులు తెలిపారు. టీవీఎస్ నాయకుల విజ్ఞప్తి మేరకు ఈ రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాన్ని హరీష్‌రావు గురువారం సందర్శించనున్నారు.
 
తడకలపల్లి టు గౌరవెల్లి.. సిద్దిపేట మండలం తడకలపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.4 టీఎంసీల నుంచి ఇటీవలే అ మాంతం 29 టీఎంసీలకు పెంచారు. ఈ మేరకు రిజర్వాయర్ నిర్మాణ పనులు చురుకుగా కొసాగుతున్నారుు. అక్కడినుంచి నంగునూర్ వరకు కాలువలు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యమానేరు లింక్ రిజర్వాయర్ అరుున గౌరవెల్లిని తడుకపల్లితో లింక్ చేసేందుకు ప్రతిపాదన లు రూపొందించారు. నంగునూరుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున గ్రావిటీ ద్వా రా నీటిని తరలించడం కష్టం కాదని భావిస్తున్నా రు.

అంతేకాకుండా ఈ పనులు జరిగితే మార్గమధ్యంలో కోహెడ మండలం బస్వాపూర్ చెక్‌డ్యామ్‌లను నింపితే శనిగరం, సింగరాయ జలాశయూలు నిండి కోహెడ మండల సస్యశ్యామలం అవుతుంది. అలాగే గౌరవెల్లి నుంచి కాలువల ద్వారా మల్లంపల్లిలో ఉన్న డిస్ట్ట్రిబ్యూటరీ ద్వారా మీర్జాపూర్, మహాసముద్రం గండిని నింపే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి గొలుసుకట్టు చెరువుల ద్వారా సైదాపూర్ మండలం ఆకునూర్ చెరువును 1.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌గా మార్చవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు.
 
వరద వచ్చినప్పుడే నీళ్లు..
మొదటి ప్రణాళిక ప్రకారం వరద కాలువ నుంచి వరదలు వచ్చినప్పుడే గౌరవెల్లి రిజర్వాయర్ కళకళలాడుతుంది. ఓగులాపూర్ రిజర్వాయర్ పనులు నేటికీ ప్రారంభం కాకపోవడంతో ఈ పనులు పూర్తయితే గాని గౌరవెల్లి రిజర్వాయర్‌కు నీళ్లు రావు. ఈ ప్రాజె క్ట్‌లకు బడ్జెట్‌లో నయా పైసా కేటాయించకపోవడంతో ఇప్పట్లో ఈ పనులు కావనే నమ్మకం ప్రజల్లో నెలకొంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా టీవీఎస్, జేఏసీ నాయకులు మరో ప్రతిపాదనను మంత్రి ముందు ఉంచినట్లు తెలిపారు. తడకపల్లి నుంచి గ్రావిటీ ద్వారా గౌరవెల్లి రిజర్వాయర్‌కు నీటిని పంపితే జలకళ ఉట్టిపడుతుందని భావిస్తున్నారు.

ఈ ప్రతిపాదన వాస్తవ రూపం దాల్చితే గౌరవెల్లి రిజర్వాయర్‌ను అతి తక్కువ ఖర్చుతో ఎనిమిది టీఎంసీలకు పెంచితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఇంజనీర్లు మంత్రి హారీష్‌రావుకు సూచించినట్లు తెలిసింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకే మంత్రి గురువారం గౌరవెల్లి రిజర్వాయర్, ఉమ్మాపూర్‌లోని మహాసముద్రం గండిని సందర్శించనున్నారు. గండిని పూడ్చితే మూడువేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు మంత్రికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది.
 
ఎనిమిదేళ్లుగా అతీగతీ లేదు..
2007లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 1.4 టీఎంసీల సామర్థ్యం గ ల గౌరవెల్లి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ఎనిమిదేళ్లలో కేవలం మట్టి కట్ట పనులు మాత్రమే జరిగారుు. రిజర్వాయర్‌లో 2200 ఎకరాల భూములు, గూడాటిపల్లి, మద్దెలపల్లి, తెనుగుపల్లితో పాటు గిరిజన తండాలు ముంపునకు గురవుతున్నాయి. దాదాపు 200 ఎకరాల అస్సైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంది. 687 ఇళ్లు ముంపునకు గురవుతుండగా ఇటీవల దాదాపు 220 ఇళ్లకు పైగా రూ.28 కోట్లు నిర్వాసితుల అకౌంట్లో జమచేశారు. మిగతా 400పైగా ఇళ్లకు పరిహారం అందించాల్సి ఉంది.
 
పరిహారం సొమ్ముతో కుటుంబ పోషణ
రిజర్వాయర్ పనులు ప్రారంభమై ఎనిమిదేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితుల తిప్పలు అన్నీఇన్నీ కావు. వ్యవసాయ భూములను బొందల గడ్డలుగా మార్చడంతో సాగు చేసుకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి కరువై.. సర్కా రు ఇచ్చిన పరిహారం సొమ్ముతోనే కుటుంబాన్ని పోషించుకునే దుస్థితి నెలకొంది. ప్రస్తుత ధరల ప్రకారం పరిహారం డబ్బులతో ఎకరం భూమి కూడా కొనలేరు.  ఇప్పటికీ పునరావాసానికి స్థలం లేదు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కల్పించాలని మంత్రిని కోరనున్నట్లు యువకులు పేర్కొంటున్నారు. ముందు భూనిర్వాసితుల పరిహారంతో పాటు సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు మంత్రిని కోరనున్నారు.

>
మరిన్ని వార్తలు