ఉద్యోగం వదిలి ఉద్యమించినా టికెట్‌ ఇవ్వలేదు

11 Sep, 2018 11:14 IST|Sakshi
తన ఉద్యమ జ్ఞాపకాలను చూపిస్తున్న గోవింద్‌నాయక్‌

ములుగు (వరంగల్‌): ‘తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఉద్యమంలో తొలి నుంచి భాగస్వామినై పోరాడాను. 2003 నుంచి పరోక్షంగా ఉద్యమంలో పాల్గొన్నా. ఉద్యమ స్ఫూర్తితో 2004లో నా టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో పాల్గొన్నా. 2004 ఎన్నికల్లో టికెట్‌ అడిగినా టీఆర్‌ఎస్,  కాంగ్రెస్‌ పొత్తుతో పొదెం వీరయ్యకు టికెట్‌ కేటాయించారు. 2009లో టీడీపీతో పొత్తు కారణంగా సీతక్కకు సీటు దక్కింది. అయినా పార్టీ ఉన్నతికి పాటుపడుతూనే ఉన్నా. శ్రమను గుర్తించి ఎన్నికల్లో టికెట్‌ కేటాయిస్తారని ఆశించినా ఫలితం దక్కకపోవడం బాధగా ఉంది’ అని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు పోరిక గోవింద్‌నాయక్‌ తన ఆవేదనను వెలిబుచ్చారు.

సోమవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.   టీఆర్‌ఎస్‌ను గ్రామ స్థాయిలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బేతెల్లి గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లెల్ల కుమారస్వామి, జలగం మోహన్‌రావుతో కలిసి బలోపేతం చేశామని, అప్పటి నుంచి రూ.50 లక్షల నుంచి 60 లక్షలను ఖర్చు చేశానన్నారు. ఆ తర్వాత ఆర్థికంగా చతికిలపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కు తగిన గుర్తింపు దక్కలేదని వాపోయారు. 20 14లో టికెట్‌ ఆశించినా టీఆర్‌ఎస్‌ తరఫున అజ్మీ రా చందూలాల్‌కు టికెట్‌ కేటాయించారని తెలి పారు.

అయినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగినట్లు తెలిపారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని ఆశించినా చందూలాల్‌ కుమారుడు ప్రహ్లాద్‌కి ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్‌ దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించినా ఏ ఒక్కరూ సహకరించలేదని వాపోయారు. మళ్లీ చందూలాల్‌కి టికెట్‌ కేటాయించ డం బాధ కలిగించిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ఇప్పటికైనా అధిష్టానం తన గత పోరాటాలు, త్యాగాన్ని గుర్తిం చి ములుగు టికెట్‌ విషయంలో తన అభ్యర్థనను పరిశీలించాలని కోరారు.

మరిన్ని వార్తలు