త్వరలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌!

1 Nov, 2019 01:30 IST|Sakshi

ఏర్పాట్లు చేస్తున్న గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు

మొత్తంగా 2,500 ఖాళీల భర్తీకి కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీని 31 జిల్లాల ప్రకారమే చేపట్టే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన ములుగు, నారాయణ్‌పేట్‌ కలుపుకొని 33 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో 31 జిల్లాల ప్రకారమే ముందుకు సాగాలని తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఆర్‌ఈఐ–ఆర్‌బీ) భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు సమాచారం.

దీంతో గురుకులాల్లోని 2,500 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. మొత్తం 5 శాఖలకు చెందిన గురుకులాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులకు సంబంధించిన వివరాలను ఆయా గురుకులాల సొసైటీల కార్యదర్శులు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 1,900 పోస్టులు బీసీ గురుకులాలకు చెందినవి కాగా, మరో 600 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు జనరల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలోని పోస్టులను భర్తీ చేయనున్నారు.

1,900 పోస్టులు బీసీ గురుకులాల్లోనే..
ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ గురుకులాలు 261 ఉండగా, అందు లో 119 గురుకులాలు ఈ ఏడాదే ప్రారంభం అయ్యాయి. వాటిల్లోనే 1,900 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 1,071 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), 119 స్టాఫ్‌నర్స్, 119 లైబ్రేరియన్స్, 119 ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్లు, 110 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. అలాగే పీజీటీ హిందీ–100, ఫిజికల్‌ డైరెక్టర్స్‌–70 పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా మరో 192 పోస్టులను మిగతా బీసీ గురుకులాల్లో భర్తీ చేయనున్నారు. ఇతర సంక్షేమ శాఖలకు చెందిన గురుకులాల్లో మరో 600 వరకు బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఆయా పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని రెసిడెన్షియల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సీఎస్‌కు లేఖ రాసింది.

మరిన్ని వార్తలు