వైద్యం వికటించి అసువులు బాసిన సోదరులు

10 May, 2015 23:35 IST|Sakshi

శాంతినగర్(మహబూబ్‌నగర్): మద్యం మాన్పించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నాటువైద్యం వికటించి సోదరులు వరుసయ్యే ఇద్దరు చనిపోయారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం రాజోలి గ్రామంలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం రాజోలి గ్రామానికి చెందిన నాగన్న(30) మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతనికి వరుసకు తమ్ముడైన ఇటిక్యాల మండలం మునుగాల గ్రామానికి చెందిన భాస్కర్(28) అలియాస్ రాజుతో కలసి తరుచూ మద్యం తాగేవాడు. మద్యం వ్యసనం నుంచి దూరం చేయాలని సంకల్పించిన బావమరిది సుధాకర్ వారిద్దరినీ కర్నూలు జిల్లా సోముల గూడూరులో ఉన్న నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు.

అక్కడ చెట్టుపసరు తాగిన అనంతరం తిరిగి ఆటోలో గ్రామాలకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం నాగన్న, భాస్కర్ అపస్మారక స్థితికి చేరుకున్నారు. వైద్యుడికి చూపించగా అప్పటికే ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు