అప్పుల బాధతో ఇద్దరు మహిళల బలవన్మరణం

26 Nov, 2014 02:31 IST|Sakshi
అప్పుల బాధతో ఇద్దరు మహిళల బలవన్మరణం

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇద్దరు మహిళలను బలిగొన్నాయి. అప్పుల బాధతోపాటు తన ముగ్గురు పిల్లలు వికలాంగులు కావడం, భర్త అనారోగ్యంతో బాధపడుతుండడంతో చిలుకోడు శివారు ఫకీరాతండాలో సర్పంచ్ భార్య ఆత్మహత్యకు పాల్పడగా.. వ్యవసాయానికి చేసిన అప్పులు పెరిగిపోవడంతో తరిగొప్పులలో మరో మహిళ బలవన్మరణానికి పాల్పడింది.
 
చిలుకోడు(డోర్నకల్) : కుటుంబ సమస్యలతో ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని చిలుకోడు గ్రామపంచాయతీ పరిధిలోని ఫకీరాతండాలో మంగళవారం జరిగింది. ఎస్సై రమేష్‌కుమార్ కథనం ప్రకారం.. ఫకీరాతండాలో నివాసముంటున్న చిలుకోడు సర్పంచ్ గుగులోత్ కిషన్‌సాదుకు భార్య జగ్ని(50), ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులు రవి, వెంకన్న, కుమార్తె కౌసల్య పోలియో కారణంగా వికలాంగులుగా మారారు. కౌసల్యకు అదే తండాకు చెందిన ఓ యువకుడితో పెళ్లి చేయగా ఒక పాప పుట్టింది. అరుుతే ఆరు నెలల క్రితం కౌసల్యను భర్త వదిలి వెళ్లడంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.

ముగ్గురు వికలాంగులు కావడంతో తల్లి జగ్ని వారిని కంటికి రెప్పలా కాపాడుతూ కాలం వెళ్లదీస్తోంది. కొద్దిరోజుల క్రితం కిషన్‌సాదు కళ్లకు ఆపరేషన్ కావడం, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. దీంతో ఆయన ఆస్పత్రి ఖర్చులతోపాటు తన ఏడెకరాల భూమిలో వ్యవసాయం చేసేందుకు సుమారు ఐదు లక్షల రూపాయలకుపైగా అప్పు చేశాడు. పిల్లలు వికలాంగులు కావడం, భర్త అనారోగ్యం పాలవడం, అప్పులు కావడంతోపాటు కుటుంబ తగాదాల నేపథ్యంతో తీవ్ర మనోవేదనకు గురైన జగ్ని మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది.

చుట్టుపక్కలవారు గమనించేసరికి మృతిచెంది ఉంది. పవర్‌స్ప్రేయర్ బాగు చేయించేందుకు డోర్నకల్ వచ్చిన కిషన్‌సాదు విషయం తెలుసుకుని తండాకు వచ్చి జగ్ని మృతదేహాన్ని చూసి కుప్పకూలాడు. కుమారులు, కుమార్తె తల్లి మృతదేహంపై పడి బోరున ఏడ్చారు. పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా కళ్లల్లో పెట్టుకుని కాపాడుకున్న జగ్ని అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఇప్పుడు ఆ కుటుంభాన్ని ఎవరు చూసుకుంటారంటూ తండావాసులు కంటతడి పెట్టారు. మృతదేహాన్ని మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు