వరంగల్ : అన్ని మున్సిపాలిటీలు గులాబీవే

28 Jan, 2020 11:38 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో మరోసారి టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. అన్ని మున్సిపాలిటీల చైర్మన్, వైస్‌ చైర్మన్‌ స్థానాలు ఆ పార్టీ సొంతమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి మండల, జెడ్పీ ఎన్నికల వరకు విజయ పరంపర కొనసాగించిన టీఆర్‌ఎస్‌... ‘పుర’ ఎన్నికల్లోనూ అదే ఊపు కనబర్చింది. మొత్తం తొమ్మిది మున్సి పాలిటీల్లో చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవుల ను సొంతం చేసుకోవడం ద్వారా అధికా ర టీఆర్‌ఎస్‌ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేష న్‌ వెలువడిన రోజు నుంచి టీఆర్‌ఎస్‌ అధి ష్టానం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసింది. గెలుపే లక్ష్యంగా అమలుచేసిన వ్యూహప్రతివ్యూహా లు, తీసుకున్న జాగ్రత్తలతో ఉమ్మడి జిల్లాలో ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. 

కొన్ని మార్పులు మినహా...
మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్, నామి నేషన్ల ప్రక్రియ మొదలు.. చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల వరకు అంతా ఊహించి నట్లుగానే జరిగింది. ఈ ఎన్నికలు ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటాయని ప్రచారం జరిగినప్పటికీ... టీఆర్‌ఎస్‌ పార్టీకి పూర్తిగా అనుకూలించాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ముఖ్యులు, ఇన్‌చార్జీలు ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించగా.. ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. అయితే చైర్మన్, వైస్‌ చైర్మన్ల విషయంలో అక్కడక్కడ ఉత్కంఠ నెలకొన్నా మొదటి నుంచి ప్రయత్నాల్లో ఉన్న వారినే పదవులు వరించాయి.

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పరకాల మున్సిపల్‌ చైర్మన్‌గా సోదా అనిత ఎన్నిక కాగా, వైస్‌ చైర్మన్‌గా రేగూరి జైపాల్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్ధన్నపేట కొత్త మున్సిపాలిటీ తొలి చైర్మన్‌గా అంగోతు అరుణ, వైస్‌ చైర్మన్‌గా కొమండ్ల ఏలందర్‌రెడ్డికి అవకాశం దక్కింది. నర్సంపేట మున్సిపల్‌ చైర్మన్‌గా మాత్రం మొదటి నుంచి రుద్ర మల్లేశ్వరి, నాగిశెట్టి పద్మ పేర్లు వినపడగా, ఆది నుంచి ఉద్యమంలో కలిసి నడిచిన గుంటి కిషన్‌ భార్య గుంటి రజనికి ఆ పీఠం అప్పగించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా రజనికే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరోసారి ఉద్యమం నుంచి వచ్చిన నేతగా తన నేపథ్యాన్ని చాటుకున్నారు. వైస్‌ చైర్మన్‌గా మునిగాల వెంకటరెడ్డి ఎన్నికయ్యారు.

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపల్‌ చైర్మన్‌ గుగులోతు సింధూర, వైస్‌ చైర్మన్‌గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, మహబూబాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా మహ్మద్‌ ఫరీద్‌ ఎన్నికయ్యారు. డోర్నకల్‌ మున్సిపాలిటీ చైర్మన్‌గా వాంకుడోతు వీరన్న, వైస్‌ చైర్మన్‌గా కేశబోయిన కోటిలింగం, తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్‌ చైర్మన్‌గా జీనుగ సురేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భూపాలపల్లి మున్సిపల్‌ చైర్మన్‌గా సెగ్గం వెంకటరాణి ఎన్నిక కాగా, వైస్‌ చైర్మన్‌ గండ్ర హరీష్‌రెడ్డి పేరు వినిపించింది. చివరి నిముషంలో వైస్‌ చైర్మన్‌గా కొత్త హరిబాబుకు అవకాశం కల్పించారు. జనగామపై కొంత ఉత్కంఠ నెలకొన్నా.. ఆ  మున్సిపాలిటీ నుంచి చైర్మ్‌న్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన పోకల జమున ఎన్నిక కాగా, వైస్‌ చైర్మన్‌గా మేకల రాంప్రసాద్‌ ఎన్నికయ్యారు.

ప్రశంసల జల్లు
ఒక్కటి ఓడినా పదవి ఊడుతుంది.. అని హెచ్చరికలు వచ్చినా, ఫలితాల తర్వాత వరంగల్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలకు అధిష్టానం నుంచి ప్రశంసలు దక్కాయి. ఒక్క జనగామ మున్సిపాలిటీ వార్డుల ఎన్నికల సందర్బంగా అక్కడి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని, అందువల్లే ఫలితాలు ‘హంగ్‌’ దిశగా వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తం చేసిన అధిష్టానం సీనియర్లను రంగంలోకి దింపి చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులనుపార్టీ ఖాతాలో వేసుకుంది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌ విడుదల నుంచి చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల వరకు గెలుపు కోసం పని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులను టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

ఈ మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సీనియర్‌ ఎమ్మెల్యేలు డీఎస్‌.రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి తదితరులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో పని చేసిన ఇన్‌చారి్జలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కేడర్‌కు అభినందన పత్రాలు కూడా పంపిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. కాగా తొమ్మిది మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా సోమవారం పోలీసులు గట్టి బందోబస్తు, భద్రత ఏర్పాటు చేయగా, ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  

మరిన్ని వార్తలు