హసన్పర్తి: మహాకూటమి వర్ధన్నపేట నియోజకవర్గ టికెట్ ఎట్టకేలకు తెలంగాణ జనసమితికి కేటాయించారు. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం ఆదివారం రాత్రి ప్రకటించారు. ప్రవాస భారతీయుడు డాక్టర్ పగిడిపాటి దేవయ్యకు ఈ టికెట్ కేటాయించింది. టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు నమిండ్ల శ్రీనివాస్, బక్క జడ్సన్, డాక్టర్ విజయ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే మహాకూటమి పొత్తులో భాగంగా స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేటలోని ఏదైనా ఒక స్థానం కేటాయించాలని టీజేఎస్ కోరింది.
దీంతో చివరి క్షణం వరకు టిక్కెట్పై సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి పగిడిపాటి దేవయ్యకు టిక్కెట్ కేటాయిస్తూ కోదండరాం ప్రకటన చేయడంతో సస్పెన్స్ వీడింది. కాగా పగిడిపాటి దేవయ్య ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించడం ఇది మూడోసారి. రెండుసార్లు టిక్కెట్ కోసం ప్రయత్నించారు. మూడో సారి టీజేఎస్ తరఫున ఆయనకు టిక్కెట్ దక్కింది. 2015లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో దేవయ్య వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా శనివారం దేవయ్య బీఎస్పీ తరఫున వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సోమవారం ఆయన టీజేఎస్ తరఫున నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించనున్నారు.
పగిడిపాటి దేవయ్య ప్రొఫైల్