కృష్ణా బేసిన్‌ ఖాళీ!

3 Jul, 2019 01:42 IST|Sakshi

సీజన్‌ ఆరంభమైనా కృష్ణా బేసిన్‌లో చుక్క నీటికి కరువే

ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌కు లేని ప్రవాహాలు 

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు మిగిల్చిన నైరాశ్యం రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టులపై ఎనలేని ప్రభావం చూపుతోంది. నెల రోజులైనా వానల జాడలేకపోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు వచ్చి చేరలేదు. సాధారణంగా జూన్‌లో ప్రవాహాలుండే గోదావరి సైతం నీటి ప్రవాహాల జాడ కానరాక నిర్జీవంగా మారగా, కృష్ణా బేసిన్‌లో కరువు పరిస్థితులే కళ్లకు కడుతున్నాయి. గతానికిభిన్నంగా ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి నెల రోజుల్లో చుక్క నీరు రాకపోవడం దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఇక్కడే ఏకంగా 223 టీఎంసీల మేర నీటి కొరత ఉండటం, ఇప్పటికిప్పుడు మెరుగైన వర్షాలు కురిసినా అక్కడి ప్రాజెక్టులు నిండి తెలంగాణలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీటి ప్రవాహం రావాలంటే ఆగస్టు ఆఖరి దాకా ఆగాల్సిన దుస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లి ప్రాజెక్టుల్లో నీటిని తోడుతున్న నేపథ్యంలో ఆగస్టు వరకు ఆగడం రాష్ట్రానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టనుంది.

ఎగువనా కరువే... 
కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నిల్వలు ఇప్పటికే కనీస మట్టాల దిగువకు పడిపోయాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లోనే ఏకంగా 368 టీఎంసీల నీటి లోటు ఉంది. గత నెల రోజుల్లో ఇక్కడ ఎలాంటి ప్రవాహాలు లేవు. ఇప్పటికే సాగర్‌లో రాజధాని తాగునీటి అవసరాల కోసం అత్యవసర పంపింగ్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల్లోకి నీరు చేరాలంటే ఎగువ కర్ణాటక ప్రాజెక్టులు నిండాల్సి ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ నిండితేనే దిగువకు ఇన్‌ఫ్లో ఉంటుంది. అక్కడా లోటు వర్షపాతం కారణంగా ప్రవాహాలే లేవు. ఆల్మట్టిలో ప్రస్తుతం 129.72 టీఎంసీలకు గాను కనీస నీటి మట్టాలకు దిగువన 21.70 టీఎంసీలు, నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకు గాను 18.18 టీఎంసీ, తుంగభద్రలో 100.86 టీఎంసీలకు కేవలం 1.91 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మొత్తంగా 223 టీఎంసీల మేర లోటు కనబడుతోంది. ఇందులో కనీసంగా 105 నుంచి 120 టీఎంసీలు చేరితే గానీ దిగువకు ఇన్‌ఫ్లో కొనసాగే అవకాశం లేదు.

ముఖ్యంగా ఆల్మట్టిలో 100 టీఎంసీల నీరు చేరితే దిగువ నారాయణపూర్‌కు వదులుతారు. అక్కడ ప్రాజెక్టు నిండిన అనంతరం దిగువ రాష్ట్రానికే వదిలే అవకాశం ఉంటుంది. సాధారణంగా జూన్‌ రెండు, మూడో వారం నుంచే ప్రవాహాలుంటాయి. ఇంతకుముందు సంవత్సరాల్లో ఆల్మట్టికి జూన్‌లోనే 20 నుంచి 30 టీఎంసీల నీటి రాక వచ్చిన సందర్భాలున్నాయి. జూలై నుంచి అవి పుంజుకుంటే జూలై మూడో వారం నుంచి దిగువకు నీటి విడుదల జరిగేది. కానీ ప్రస్తుతం భిన్న పరిస్థితి కనబడుతోంది. గత ఏడాది జూలైతో పోలిస్తే ప్రస్తుతం ఎగువ, దిగువ ప్రాజెక్టుల్లో 60 టీఎంసీల మేర నిల్వలు తక్కువగా ఉన్నాయి. అక్కడ చుక్క నీటి ప్రవాహాలు లేకపోవడంతో ఈ నెలలో కురిసే వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ నెలలో సరైన రీతిలో వర్షాలు కురిసి ప్రవాహాలు కొనసాగితే.. ఆగస్టు చివరి వారం నుంచి దిగువ ప్రాజెక్టులకు ప్రవాహాలు ఉంటాయి. లేనిపక్షంలో కృష్ణా బేసిన్‌లో గడ్డు పరిస్థితులు తప్పవు. 

భూగర్భం విలవిల 
రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. నైరుతి రుతుపవనాల జాప్యంతో వర్షాలు లేక నీటిమట్టాలు పాతాళానికి చేరాయి. రాష్ట్ర సరాసరి భూగర్భ నీటిమట్టం ప్రస్తుతం 14.40 మీటర్లకు చేరింది. గత ఏడాది తో పోలిస్తే 2.13 మీటర్ల దిగువన భూగర్భ జలాలున్నాయి. జూన్‌కు సంబంధించి భూగర్భ జల శాఖ 589 మండలాల్లోని 941 పరిశీలక బావుల ద్వారా భూగర్భ జలమట్టాలను విశ్లేషించింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 129.2 మిల్లీమీటర్లకుగానూ కేవలం 87.1 మి.మీ.లుగా నమోదైంది. 33 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.  గత ఏడాది జూన్‌లో రాష్ట్ర సరాసరి నీటి మట్టం 12.27 మీటర్లుండగా, ఈ ఏడాది 14.40 మీటర్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 2.13 మీటర్ల మేర భూగర్భమట్టం దిగజారింది. కేవలం 4 జిల్లాల్లో 0.12 మీటర్ల నుంచి 1.03 మీటర్ల మేర పెరుగుదల కనిపించగా, 29 జిల్లాల్లో 10.70 మీ. నుంచి 0.06 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. రాష్ట్ర మొత్తంగా మెదక్‌ జిల్లాలో 26.5 మీటర్ల దిగువకు మట్టాలు పడిపోగా, తర్వాతి స్థానంలో సంగారెడ్డి (23.96 మీటర్లు), వికారాబాద్‌ (20.23 మీటర్లు) ఉన్నాయి.   

గొల్లుమంటున్న గోదావరి... 
రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరికి కూడా ఈ ఏడాది నీటి ప్రవాహాలు లేవు.   గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఒక్క టీఎంసీ నీరు కూడా చేరలేదు. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్‌ ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే  83 టీఎంసీల మేర నీటినిల్వలు తక్కువ గా ఉండటం, అక్కడ అధికవర్షాలు నమోదైతేగానీ దిగువకు నీరిచ్చే అవకాశం లేకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. సాధారణంగా కృష్ణాబేసిన్‌తో పోల్చి చూస్తే గోదావరి బేసిన్‌లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి.  ఎగువన భారీ వర్షాలు కురిసినా అవి గోదావరి పరీవాహకంలో లేకపోవడంతో దిగువ ఎస్సారెస్పీ, సింగూరుకు నీటి ప్రవాహాలు పెద్దగా లేవు. నిజాంసాగర్‌  వట్టిపోయింది. బాబ్లీ గేట్లు సోమవారం తెరుచుకున్నా దిగువకు చుక్క వచ్చే పరిస్థితులు లేవు. గోదావరి, ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద సైతం గత ఏడాది ఇదే సమయానికి లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా ఈ ఏడాది కేవలం 3 వేల క్యూసెక్కులకు మించి ప్రవాహం లేదు.  
 

మరిన్ని వార్తలు