సంక్షేమం, అభివృద్ధికే ప్రాధాన్యం

25 Apr, 2015 02:05 IST|Sakshi
సంక్షేమం, అభివృద్ధికే ప్రాధాన్యం

టీఆర్‌ఎస్ ప్లీనరీలో మొత్తం 13 తీర్మానాలను నేతలు ప్రవేశపెట్టగా వాటిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అందులో దాదాపు 12 అంశాలు దాదాపుగా టీఆర్‌ఎస్ హామీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించినవే ఉండగా.. ఒక్క అంశం మాత్రం పార్టీ నియమావళికి సంబంధించినది. వివిధ అంశాలపై ప్రవేశపెట్టిన తీర్మానాలు ఇలా ఉన్నాయి..              
- సాక్షి, హైదరాబాద్
 
కార్యకర్తలకు ప్రాధాన్యమిద్దాం

ప్రవేశపెట్టింది: పెద్ది సుదర్శన్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు.. దీన్ని దేవీప్రసాద్ బలపర్చారు.
పద్నాలుగేళ్ల పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా కేసీఆర్‌పై విశ్వాసంతో కార్యకర్తలు పార్టీని కాపాడుతూ వచ్చారు. కానీ ప్రజాప్రతినిధులు వారికి ప్రాధాన్యమివ్వట్లేదు. దీనిపై ప్రజాప్రతినిధులకు అధినేత తగు సూచనలివ్వాలి. కార్యకర్తల స్థాయి, అర్హత, సామాజిక కోణాన్నిబట్టి నామినేటెడ్ పోస్టులివ్వాలి. ప్రభుత్వ పథకాల ప్రచారానికి వారి సేవలను వినియోగించుకోవాలి. ఇందుకు వారికి నిత్యం శిక్షణా తరగతులు నిర్వహించాలి. టీఆర్‌ఎస్‌ను దేశంలోనే అత్యంత పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కలిగిన పార్టీగా తీర్చిదిద్దాలి.
 
విశ్వనగరంగా హైదరాబాద్

ప్రవేశపెట్టింది: బి.వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ, వరంగల్.. ఎంఏ బేగ్ దీనిని బలపర్చారు.
న్యూయార్క్, లండన్ నగరాలకు దీటుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని, ఇతర పట్టణాల్లో రింగ్‌రోడ్లు, అంతర్గత రోడ్లు, మార్కెట్లు, శ్మశానాలు తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ‘మునిసిపాలిటీలు మురికి కూపాలయ్యాయి. హైదరాబాద్‌లో కూరగాయల మార్కెట్లు, ధోబీ ఘాట్లు, రోడ్లు, డ్రైనేజీలు, బస్టాండ్లు వికృతంగా తయారయ్యాయి. హుస్సే న్ సాగర్‌ను శుద్ధి చేసి తీరుతాం’ అని ప్రకటించారు.
 
తెలంగాణ ప్రజా సంక్షేమం

ప్రవేశపెట్టింది: కడియం శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి
ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు కదులుతున్నాం. సంక్షేమ హాస్టళ్లలో గతంలో ముక్కిపోయిన అన్నం, పాడైన సాంబారు వడ్డించేవారు. సన్నబియ్యాన్ని సంక్షేమ హాస్టళ్లలో పెడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టేందుకు అధినేత కృషి చేయాలి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం వెంటనే అమలు చేయాలి. దళితులకు మూడెకరాల సాగుభూమి పంపిణీ పథకం అమలును వేగవంతం చేయాలి.
 
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం

ప్రవేశపెట్టింది: నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై దాడి జరిగింది. తెలంగాణ పోరాట యోధుల నెత్తురు చవిచూసిన ఆంధ్రా నాయకుల విగ్రహాలు, ఆనవాళ్లూ ఇంకా ఇక్కడ ఉండటం సమంజసం కాదు. రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు, ఉద్యానవనాలకు, వీధులకు, యూనివర్శిటీలకు తెలంగాణ మహనీయుల పేర్లు పెట్టాలి. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలి. ప్రతి జిల్లా కేంద్రంలో బహుళార్ధక సాంస్కృతిక కేంద్రాలను నిర్మించాలి. తెలంగాణ సాహి త్య ముద్రణకు, ఉద్యమ చరిత్రను రికార్డు చేసే చర్యలు చేపట్టాలి.
 
వ్యవసాయం- మిషన్ కాకతీయ

ప్రతిపాదించింది: టి.హరీశ్‌రావు, సాగునీటిశాఖ మంత్రి
నీళ్లు, నిధులు, నియామకాలపై జరిగిన తెలంగాణ పోరాటాన్ని గుర్తుంచుకొని ఇప్పుడు నీళ్లను ఒడిసిపట్టుకునే కార్యక్రమానికి పూనుకున్నాం. చుట్టూ గోదావరి, కృష్ణా నదులున్నా చుక్కనీరు వాడుకోలేని పరిస్థితులు ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూనే, కొత్తగా పాలమూరు ఎత్తిపోతల తెస్తున్నాం. చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయను ప్రజా కార్యక్రమంగా మలిచాం. మిషన్ కాకతీయ పనులు పారదర్శకంగా జరిగేలా, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడకుండా కఠినంగా వ్యవహరించాలి.
 
తెలంగాణ విద్యుత్ రంగం


ప్రవేశపెట్టింది: విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి
రాష్ట్రం విడిపోతే తెలంగాణలో విద్యుత్ ఉండదన్న నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినా సీఎం కేసీఆర్ కేవలం ఏడాదిలోనే ఈ సమస్యను అధిగమించారు. నేదునూరు, శంకరపల్లిలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపులు జరపాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. ప్రస్తుతం రాష్ట్రం 4,320 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి వుండగా.. 2018 నాటికి 20,633 ఎంవీలకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త థర్మల్ ప్లాంట్లను నిర్మిస్తున్నాం. జల, బొగ్గు, సౌర విద్యుత్ కలిపి 2018 నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 24,075 ఎంవీలకు పెంచుతాం.
 
 రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన

ప్రవేశపెట్టింది: రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
ఈ తీర్మానాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బలపర్చారు.  తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామానికి డబల్ రోడ్లు, పట్టణాలు, జిల్లా కేంద్రాలకు నాలుగు లైన్ల రహదారులను నిర్మిస్తాం. రాష్ట్రంలోని విమానాశ్రయాలు, డ్రై పోర్టులు,  జాతీయ రహదారుల విస్తరణ తదితర పనులతో రాష్ట్ర రవాణా రంగాన్ని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం. ఇందుకోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం.
 
 
తాగునీటి వ్యవస్థ, పారిశ్రామిక రంగం-ఐటీ

ప్రవేశపెట్టింది: పంచాయతీరాజ్,  మంత్రి కేటీఆర్ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీటి సరఫరా చేస్తాం. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు సాంకేతిక నివేదిక ఇతర రాష్ట్రాలకు సైతం మార్గదర్శకంగా వుందని కేంద్రం ప్రశంసించింది. ప్రస్తుతం రాష్ట్రం రూ. 57 వేల కోట్ల ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. రాబోయే నాలుగేళ్లలో ఎగుమతులను రెట్టింపు చేసి ఆదాయాన్ని రూ. లక్షా 20 వేల కోట్లకు పెంచుతాం. నాలుగేళ్లలో ఇంటింటికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌తో ఇంటర్నెట్ ఇస్తాం.    
 
 వర్తమాన రాజకీయాలు- టీఆర్‌ఎస్

ప్రవేశపెట్టింది: ఈటల రాజేందర్, ఆర్థిక మంత్రి
రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆంధ్ర పార్టీల నేతలు కుట్రలకు పాల్పడుతున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు దివాలాకోరు పార్టీలను చీల్చి చెండాడి టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతివ్వాలి. టీఆర్‌ఎస్ పార్టీ నేతత్వంలో ప్రజలంతా కేసీఆర్‌కు బాసటగా నిలిచి బంగారు తెలంగాణ కోసం పాటుపడాలి. తెలంగాణ రాష్ట్రానికి ఒక్కపైసా కూడా ఇవ్వనని అసెంబ్లీలో చెప్పిన నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పైసాకు కూడా కొరకాకుండా పోయారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం వెనక్కి పోయిందంటూ అపవాదులు మోపాలని చూసిన కాంగ్రెస్, టీడీపీలు అభాసుపాలయ్యాయి. బీజేపీ సైతం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వలేదు.
 
 తెలంగాణకు హరితహారం

ప్రవేపెట్టింది: సీతారాం నాయక్, లోక్‌సభ సభ్యుడు
వచ్చే మూడేళ్లలో 240 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులోగా 120 కోట్ల మొక్కలు నాటాలి. ఇందులో 10 కోట్ల మొక్కలు హైదరాబాద్‌లోనూ, 110 కోట్ల మొక్కలు మిగిలిని జిల్లాల్లోనూ నాటాలని నిర్ణయించింది. అధికంగా చెట్లు పెంచిన గ్రామాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల నగదు బహుమతి ఇవ్వనుంది. ప్రతి గ్రామంలోనూ మొక్కలను విరివిగా పెంచేలా ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యపరచాలి. ముఖ్యమంత్రి పేర్కొన్నట్లుగా తెలంగాణకు వానలు వాపస్ రావాలి.. కోతులు అడవులకు వాపస్ పోవాలి.
 
 కేంద్రం ఇచ్చిన విభజన హామీలను వెంటనే నెరవేర్చాలి


ప్రవేశపెట్టింది: జితేందర్‌రెడ్డి, లోక్‌సభ సభ్యుడు
విభజన బిల్లులో పేర్కొన్నట్లుగా హైకోర్టు విభజన, నిధుల బదిలీ, ట్యాక్స్ ఇన్సెంటివ్స్, జహీరాబాద్‌లో జాతీయ విద్యా సంస్థ, రహదారుల కనెక్టివిటీ, ఎన్టీపీసీలో విద్యుత్ వాటా, కాజీపేట్‌లో  రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ.. తదితర హామీలిచ్చిన కేంద్రం ఇప్పటికీ వాటిని నెరవేర్చలేదు. 11 మందితో కూడిన ఎంపీల బృందం ఈ హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతుంది. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలను 153కు పెంచుతామని ఇచ్చిన హామీని కూడా కేంద్రం నెరవేర్చాలి.
 
గృహ నిర్మాణం, పుష్కరాలు

 ప్రవేశపెట్టింది: ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి
 ప్రభుత్వం అతి త్వరలోనే బలహీన వర్గాల వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. గోదావరి పుష్కరాలకు గతంలో 27 పుష్కరఘాట్లు ఉండగా, ప్రస్తుతం 107కు పెంచాం. స్నాన ఘాట్లు, తాగునీటి సదుపాయాలు, ఇతర సౌకర్యాల కోసం రూ. 400 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. గత పుష్కరాలకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు రాగా, ఈసారి 8 కోట్ల మంది రావచ్చని అంచనా. న భూతో.. న భవిష్యతి అన్నట్లుగా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
 
ఎన్నికల అంశం సవరణ

ప్రవేశపెట్టింది: పర్యాద కృష్ణమూర్తి, సీనియర్ నేత
పార్టీ నియమావళిలోని ఎన్నికల అంశంలో చిన్న సవరణ చేశాం. ఇప్పటివరకు పార్టీకి సంబంధించి వివిధ స్థాయిల్లో అధ్యక్షునితోపాటు కార్యవర్గ సభ్యుల ఎంపిక కూడా ఎన్నికల ద్వారానే జరిగేది. తాజా సవరణ మేరకు ఇకపై అన్ని స్థాయిల్లోనూ అధ్యక్ష పదవికే ఎన్నిక  జరుగుతుంది. ఎన్నికైన అధ్యక్షునికి కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసుకునే అధికారం ఉంది.

మరిన్ని వార్తలు